కేసీఆర్కు చిక్కులా?: సెక్షన్ 8 ఏం చెబుతోంది?
అమరావతి: గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో జరిగిన సంకల్పయాత్రలో ఏపీ సీఎం చంద్రబాబు విభజన చట్టంలోని సెక్షన్ 8 గురించి ప్రస్తావించారు. అసలు విభజన చట్టంలో సెక్షన్ 8 ఏం చెబుతోంది? ఆంధ్రప్రదేశ్ను విభజించిన సమయంలో హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కేంద్రం పదేళ్లు ప్రకటించింది.
ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతల యంత్రాంగం గవర్నర్ ఆధీనంలో ఉండాలని ఈ సెక్షన్ 8 చెబుతోంది. కానీ, ఇంత వరకు ఈ సెక్షన్ అమల్లోకి రాకపోవడం విశేషం. ఉమ్మడి రాజధానిలో తమకు అన్యాయం జరుగుతోందని, తన ఆధీనంలో ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని తెలంగాణ ప్రభుత్వం రాజకీయ కక్షతో ఏపీ పైకి ప్రయోగిస్తుందని ఏపీ ప్రభుత్వ వర్గాల సమాచారం.
దీంతో మంగళవారం జరిగిన ఏపీ మంత్రి వర్గ సమావేశంలో విభజన చట్టంలోని సెక్షన్ 8ను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని తీర్మానం చేశారు. అంతేకాదు సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధానిలోని అధికారాలన్నీ గవర్నర్కు అప్పగించాలని కోరుతూ కేంద్రాన్ని కూడా కోరనున్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి రాజధానిలో తమ ప్రభుత్వ అవసరాలకు ఆంధ్రప్రదేశ్ పోలీసులను వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణ పోలీసులే హైదరాబాద్లో ఏపీ ప్రభుత్వ అవసరాలను చూస్తున్నారు.
ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ సంభాషణల ఆడియో టేపులు విడుదల కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఏపీకి సంబంధించి కేసుల నమోదు, విచారణకు కూడా ఏపీ పోలీసు సంస్ధలనే ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నారు.
దీనిపై ఏపీ ప్రభుత్వ ముఖ్య అధికారి ఒకరు మాట్లాడుతూ ఉమ్మడి రాజధానిలో ఇరు రాష్ట్రాలకు సమాన హక్కులుంటాయి. తెలంగాణ రాష్ట్ర పోలీసు సంస్ధలకు ఉన్న అధికారాలన్నీ ఏపీ పోలీసు సంస్ధలకు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఇంతకాలం మేం వాటిని ఉపయోగించుకోలేదని, ఇక మీదట వినియోగించుకోనున్నట్లు తెలిపారు.
ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారమే హైదరాబాద్లో శాంతిభద్రతలను గవర్నర్కు అప్పగించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి గతంలో కేంద్రం ప్రభుత్వం లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ బిల్లుపై అప్పట్లో లోకసభ్లో యూపీఏ ప్రభుత్వం రూపొందించిందని తాము తయారు చేయలేదని స్పష్టం చేశారు.
విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్లో, శాంతిభద్రతల పరిరక్షణ కోసం గవర్నర్కు ప్రత్యేక అధికారాలు జారీ చేయడం జరిగిందన్నారు. హైదరాబాద్లో శాంతిభద్రతలపై గవర్నర్ తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. గవర్నర్కు ఈ విషయంలో సలహాలు అందించడానికి... ఇద్దరు అధికారులను కేంద్రం నియమిస్తుందని చెప్పారు.