చీపురుతో ఊడ్చి...చెత్త ఎత్తేసిన జాయింట్ కలెక్టర్:స్వచ్ఛభారత్ కాదు...సమస్య పరిష్కారం
తూర్పుగోదావరి జిల్లా: అధికారులకు చిత్త శుద్ది ఉండాలే కానీ...ఏ సమస్యనైనా పరిష్కరించడం అసాధ్యమేమీ కాదని నిరూపించారు ఓ ఉన్నతాధికారి. వేతన సమస్య పరిష్కారం కోసం పారిశుద్ధ్య సిబ్బంది సమ్మెబాట పట్టడంతో ఎదురైన సమస్యను తానే స్వయంగా రంగంలోకి పరిష్కరించడం ద్వారా అధికారులందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారీ ఐఎఎస్ అధికారి...ఇంతకీ ఎవరీ అధికారి...ఎక్కడ...ఏం జరిగిందంటే...
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో వేతన సమస్య పరిష్కారం కోరుతూ కాంట్రాక్టు పారిశుద్ధ్య సిబ్బంది బుధవారం నుంచి సమ్మె చేపట్టారు. దీంతో మూడు రోజుల నుంచి జిజిహెచ్ వ్యాప్తంగా చెత్త తొలగింపు జరగక పోవడంతో తీవ్ర పారిశుద్ధ్య సమస్య తలెత్తి రోగులు, వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు.
పారిశుద్ధ్య కార్మికుల సమ్మె...తలెత్తిన సమస్యలు
పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా జిజిహెచ్ లో శానిటేషన్ సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారం చూడాలని ఆసుపత్రి అధికారులకు జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా, జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జున యాదవ్ సూచించారు. అయితే ఆస్పత్రి అధికారులు ప్రయత్నించినా ఇటు కార్మికులు సమ్మె విరమించి పనుల్లోకి రావడం గానీ లేదా...ప్రత్యామ్నాయంగా వేరే వారితో చెత్త తొలగింపు చర్యలు చేపట్టడం గాని చెయ్యడంతో ఆస్పత్రి అధికారులు విఫలం అయ్యారు.
దీంతో తానే స్వయంగా...రంగంలోకి దిగిన జెసి...
దీంతో జిజిహెచ్ లో చెత్త సమస్య అంతకంతకూ అధికమైపోతుండటంతో స్వయంగా జెసి ఎ.మల్లికార్జున యాదవ్ రంగంలోకి దిగారు. తానే జిజిహెచ్ కు చేరుకొని చీపురు తీసుకుని చెత్త ఊడ్చి ఎత్తివేయడం ప్రారంభించారు. జెసినే చెత్త ఎత్తివేయడం చూసి తొలుత అవాక్కైన అధికారులు...ఆ తరువాత తేరుకొని తాము కూడా చెత్త తొలగింపు కార్యక్రమంలో చేయి కలిపారు. అంతే కొద్ది సమయం వ్యవధిలోనే జిజిహెయచ్ చెత్త సమస్య తొలగిపోయింది.
స్వయంగా డాక్టర్...అందుకే సమస్యపై అంత సీరియస్...
ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ అన్నం మల్లికార్జున యాదవ్...2012 బ్యాచ్ కి చెందిన ఐఎఎస్ అధికారి. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా చింతాకొమ్మదిన్నె ఈ అధికారి స్వస్థలం. కర్నూలు మెడికల్ కాలేజీ నుండి ఎంబిబిఎస్ పూర్తి చేసి కొంత కాలం డాక్టర్ గా కూడా పనిచేసిన ఈ యువ ఐఎఎస్ అధికారి ఆ తరువాత సివిల్ సర్వీసెస్ కు సెలక్ట్ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా జెసిగా వెళ్లే ముందు అన్నం మల్లికార్జున యాదవ్ సిఆర్డీఏ అదనపు కమిషనర్ గా పనిచేశారు.
అందరికీ స్పూర్తిదాయకం...ఈ యువ ఐఎఎస్ అఫీసర్
స్వయంగా డాక్టర్ అయిన జెసి ఎ.మల్లికార్జున యాదవ్ కు పారిశుద్ధ్య సమస్య ఎంత ప్రమాదకరమో అవగాహన ఉండటం వల్ల సమస్య పరిష్కారం కోసం ఎవరి కోసమో ఎదురు చూడటం కాకుండా తానే స్వయంగా పరిష్కారానికి పూనుకున్న వైనంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జెసి ఎ.మల్లికార్జున యాదవ్ మిగిలిన అధికారులకు అందరికి ఆదర్శమని, ఇలాంటి అధికారులే వ్యవస్థ ను గాడి పెట్టగలరనే అభినందనల వర్షం కురుస్తోంది.