ఆపే దమ్ము ఎవరికీ లేదు, ఆస్తుల కోసమే: దామోదర
మెదక్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపే దమ్ము ఎవరికీ లేదని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మెదక్ జిల్లా మునిపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు దామోదర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణను ఆపే దమ్ము ఎవరికీ లేదన్నారు. 2009 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందని, ఎన్నో ఏళ్ల తెలంగాణ ప్రజల కల త్వరలో సాకారం కాబోతుందన్నారు.

2004, 2009 ఎన్నికలప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలంగాణ అంశం ఉందని, నాడు లేని అభ్యంతరం నేడు ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలవి ఓట్లు కావా ఇక్కడి ప్రజలకు ఆత్మగౌరవం లేదా అని ప్రశ్నించారు. ప్రపంచంలోనే తెలంగాణ ఉద్యమం సుదీర్ఘమైందని, అది గమనించే సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు ఒక ప్రాంతం వారు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన్నారు.
రాష్ట్ర ఏర్పాటును ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదని ధీమాగా చెప్పారు. సోనియాని తెలంగాణ దేవతగా దామోదర అభివర్ణించారు. క్రమశిక్షణగల కాంగ్రెస్ కార్యకర్తగా, పార్టీ విధేయుడిగా ఉన్న తనను ఆందోల్ ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించడంతో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఎదిగానన్నారు. ఇక్కడి ప్రజలకు జన్మజన్మలా రుణపడి ఉంటానని చెప్పారు. హైదరాబాదులో ఉన్న ఆస్తులను రక్షించుకోవడానికే సీమాంధ్ర నేతలు తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.
నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం నర్సన్నపల్లిలో మంత్రి సుదర్శన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీలో చర్చ జరపాలని రాష్ట్రపతి పంపిన తెలంగాణ ముసాయిదా బిల్లును అడ్డుకుంటామనడం ముఖ్యమంత్రి అవివేకమన్నారు. హుందాగా వ్యవహరించాల్సిన సిఎం రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రకటనలు చేయడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications