వెనక్కి రండి: రఘువీరా, కొండా సురేఖకు కెసిఆర్ ఓకే
హైదరాబాద్: పార్టీని వీడిన వారు దయచేసి పార్టీలోకి రావాలని లేదంటే తమకు ప్రత్యామ్నాయం ఉందని ఎపి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుల రఘువీరా రెడ్డి మంగళవారం అన్నారు. ఆయన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తదితరులతో కలిసి మాట్లాడారు. ఈ నెల 21 నుంచి 28 వరకు బస్సు యాత్ర చేపడతామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభమైన బస్సుయాత్రలో స్థానిక ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటామని అన్నారు.
21న విజయనగరంలో సింగులర్ ప్రోగ్రాంగా అభ్యర్థుల అభ్యర్థిత్వాలను స్వీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. కేవలం జిల్లా కేంద్రంలోనే కాకుండా ఇతర పట్టణాల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రచార హోరుతోనో, ఓటమి భయంతోనో, విభజన ప్రభావంతోనో, అవకాశవాదంతోనో, తెలిసో తెలియకో, అగ్రశ్రేణి నాయకులు కాంగ్రెస్ నుంచి ప్రక్కకు పోవడం వల్ల నాయకత్వ లోపం కనిపిస్తోందన్నారు.
కాంగ్రెస్ పార్టీని ఆదరించే ప్రజలకు గానీ, కార్యకర్తలకు గానీ కరువు లేదన్నారు. జెండా మోసే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నారని ఉన్నారన్నారు. మడకశిర అసెంబ్లీ నియోజకవర్గాన్ని తనకు 25 ఏళ్లుగా వదిలేసిందని, తనను నమ్మి తనకు బాధ్యత అప్పగిస్తే తాను ఉన్నపళంగా కొత్త పార్టీలోకి వెళ్తే గందరగోళం ఉంటుందన్నారు. పార్టీ వీడినవారు వీడాలనుకుంటున్న వారు, వెనక్కి రావాలన్నారు. ఎక్కడైతే నేతలు వెనక్కి రారో అక్కడికి కాంగ్రెస్ రాష్ట్ర అగ్రనాయకత్వం మొత్తం వెళ్లి ప్రచారం చేస్తుందన్నారు.
యువ నాయకత్వానికి జవసత్వాలు కల్పిస్తామని చెప్పిన ఆయన, వ్యక్తులు తాత్కాలికమని, సంస్థ శాశ్వతమని స్పష్టం చేశారు. కార్యకర్తల్లో మమేకమై వారిలో విశ్వాసం కల్పించి, నాయకత్వ లోటు తీర్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామనివిశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త నాయకత్వంలో యువకులకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని ఆయన పిలుపునిచ్చారు. తనను చాలా మంది యువకులు కలుస్తున్నారన్నారు. కాంగ్రెస్కు జవసత్వాలు ఇవ్వాల్సిన అవసరముందన్నారు.
ఈ నెల 21న శ్రీకాకుళం, విజయనగరం, 22న విశాఖ, తూర్పు గోదావరి, 23న పశ్చిమ గోదావరి, కృష్ణా, 24న గుంటూరు, ప్రకాశం, 25న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, 26న కడప, 27న అనంతపురం, కర్నూలు జిల్లాల్లో బస్సుయాత్ర ఉంటుందని చెప్పారు.
రేపు తెరాసలోకి కొండా దంపతులు
వరంగల్ జిల్లా సీనియర్ నేతలు కొండా సురేఖ, ఆమె భర్త మురళీధర రావులు రేపు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారని సమాచారం. వారు తెరాస పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో మంగళవారం భేటీ అయ్యారు. వరంగల్ తూర్పు సీటుకు కెసిఆర్ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అలాగే మురళీధర రావుకు మండలి సీటు పైన హామీ ఇచ్చారని సమాచారం.