హైదరాబాద్లో విభజన చట్టం అమలుకు కోర్టుకు, ఢిల్లీలో ఏపీ ఉద్యోగుల గోడు
హైదరాబాద్: సెక్షన్ 8, సెక్షన్ 5ను అమలు చేయాలని కోరుతూ సీమాంధ్ర సచివాలయ గెజిటెడ్ అధికారుల సంఘం గురువారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విభజన చట్టం ప్రకారం సెక్షన్ 5, సెక్షన్ 8 అమలు కావాలని, కానీ అవి అమలు కావడం లేదని పేర్కొన్నారు.
సెక్షన్ 8 ప్రకారం శాంతిభద్రతలు గవర్నర్ నరసింహన్కు అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అని చెప్పారు. అందుకోసం సెక్షన్ 5, సెక్షన్ 8 అమలు కావాలని చెప్పారు. పిల్లో కేంద్రంతో పాటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చారు.
కేంద్రమంత్రులను కలిసి గోడు వెళ్లబోసుకున్న ఏపీ విద్యుత్ ఉద్యోగులు
తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిన ఏపీ విద్యుత్ ఉద్యోగులు ఢిల్లీలో కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, సుజనా చౌదరిలను కలిశారు. తెలంగాణ ట్రాన్స్ కో నుంచి ఏపీ స్థానికత ఆధారంగా 1400 మంది ఉద్యోగులను అన్యాయంగా రిలీవ్ చేశారని చెప్పారు.
దానికి సంబంధించిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ విధుల్లోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా తమను స్థానికత పేరుతో విడదీయడం సరికాదన్నారు. రెండు ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకున్నాకే రిలీవ్ చేసేలా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు.
సీమాంధ్రులు మీ వాళ్లు కాదని, మావాళ్లేనని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు గువ్వల బాలరాజు, గణేష్లు గురువారం అన్నారు. తప్పు చేసిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.