హైదరాబాద్లో 28న సీమాంధ్ర లాయర్ల సభ, అశోక్ ఫైర్
అనంతపురం/ హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఈ నెల 28వ తేదీన హైదరాబాదులో సీమాంధ్ర న్యాయవాదులు సభను నిర్వహించాలని తలపెట్టారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తే సమైక్య ఉద్యమాన్ని దేశ రాజధాని ఢిల్లీ వరకు తీసుకుని వెళ్తామని సీమాంధ్ర న్యాయవాదుల జెఎసి నేత సివి మోహన్ రెడ్డి అన్నారు. శనివారం సీమాంధ్ర న్యాయవాదుల జెఎసి శనివారం అనంతపురంలో సమావేశమైంది.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని న్యూఢిల్లీలో రాష్ట్రపతితో పాటు పలువురు ప్రముఖులను కలిసి విజ్ఞప్తి చేస్తామని మోహన్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించే ఆలోచన కూడా ఉందని ఆయన చెప్పారు. విభజనపై న్యాయపరమైన అంశాలతో ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు.
విభజనను వ్యతిరేకిస్తూ ఈ నెల 29వ తేదీ వరకు జిల్లా కోర్టుల్లో విధులు బహిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ నగరం అందరి సొత్తు అని ఆయన అన్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ మిత్రులపై తమకు ఎలాంటి ద్వేషం లేదని చెప్పారు. సీమాంధ్ర ఉద్యమంలో భాగంగా కేసులు నమోదు అయినవారికి ఉచితంగా న్యాయసహాయం అందిస్తామని మోహన్ రెడ్డి చెప్పారు. సమైక్యాంధ్ర కోసం ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కుంటామని ఆయన చెప్పారు.
సీమాంధ్ర ప్రజాప్రతినిధుల రాజీనామాలకు తాము డిమాండ్ చేయలేదనే మంత్రులు, పార్లమెంటు సభ్యుల ప్రకటనను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు అన్నారు. రాజీనామాలు చేయాలనేది తమ డిమాండ్ అని ఆయన శనివారం హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో అన్నారు. రాజీనామాలు చేయబోమని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వారివారి నియోజకవర్గాల్లో చెప్పాలని, అప్పుడేం జరుగుతుందో చూడాలని ఆయన అన్నారు.