ఢిల్లీపై సీమాంధ్ర ఆగ్రహం: హైద్రాబాద్పై జగన్ పార్టీ పేచీ
హైదరాబాద్: సిడబ్ల్యూసి రాష్ట్ర విభజన నిర్ణయం, కాంగ్రెసు, కేంద్రం పెద్దల విభజన సానుకూల వ్యాఖ్యలు ఓ వైపు సీమాంధ్ర నేతల్లో కలవరం రేపుతుంటే, తెలంగాణ ప్రాంత కాంగ్రెసులో ఉత్సాహం కలిగిస్తోంది. అదే సమయంలో పార్లమెంటులో బిల్లు పెట్టే వరకు ఉద్యమిస్తామని తెలంగాణ ఉద్యమకారులు చెబుతుంటే, విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలపై తగ్గేది లేదని సమైక్యాంధ్రవాదులు చెబుతున్నారు.
విభజనపై నిర్ణయం తీసుకున్నామని, రాజీనామాలు చేసుకోవచ్చునని ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ అన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ వ్యాఖ్యల పైన సీమాంధ్ర కాంగ్రెసు నేతలు మండిపడుతున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసు పార్టీ నేతలు తెలిసి చేస్తున్నారో.. తెలియక చేస్తున్నారో తెలియడం లేదని మండిపడ్డారు.

తెలంగాణకు అనుకూలంగా నిత్యం కాంగ్రెసు పార్టీ పెద్దలు వ్యాఖ్యానిస్తుండటంతో ఇక లాభం లేదనే నిర్ణయానికి వచ్చిన ఏడుగురు కాంగ్రెసు ఎంపీలు రాజీనామాకు సిద్ధపడ్డారని తెలుస్తోంది. షిండే నోట్ వచ్చే వరకు ఆగాలని వారిని కేంద్రమంత్రులు బుజ్జగిస్తున్నారు. ఈ రోజు కృష్ణా జిల్లాలో లగడపాటి రాజగోపాల్ పర్యటన ఉద్రిక్తం నేపథ్యంలో ఎంపీలు రాజీనామాల వైపే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది.
హైదరాబాదుపై సై
రాష్ట్ర రాజధాని హైదరాబాదు తమ తండ్రుల, తాతల కష్టార్జితమని తెలంగాణవాదులు చెబుతున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సభ జరుగుతోంది. హైదరాబాదును యూటి చేస్తే రణరంగమేనని వారు చెబుతున్నారు. హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణ తప్ప తాము దేనినీ అంగీకరించేది లేదని చెబుతున్నారు. హైదరాబాదును యుటి చేసినా, చండీగఢ్ తరహా చేసినా అంగీకరించేది లేదని కెసిఆర్, ఓయు విద్యార్థులు హెచ్చరించారు.
హైదరాబాదు పైన అందరికీ హక్కుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల, విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్లు వ్యాఖ్యానించారు. ప్రాణహిత చేవెళ్ల పూర్తయితే తెలంగాణకు లబ్ధి చేకూరుతుందని వైయస్ భావించారని పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ చెప్పారు.
మాటిచ్చాం.. నిలబెట్టుకున్నాం: డిప్యూటి
తెలంగాణపై కాంగ్రెసు పార్టీ 2004, 2008లలో మాట ఇచ్చిందని, దానిని నిలబెట్టుకుందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. నాటి ఎన్నికల ముసాయిదాలో పెట్టామన్నారు. అప్పుడు లేని అభ్యంతరం సీమాంధ్ర నేతలకు ఇప్పుడెందుకన్నారు. తెలంగాణ ప్రజలకు కావాల్సింది అస్తిత్వం, ఆత్మగౌరవం, స్వయం పాలన అన్నారు. తెలంగాణ ప్రజలు ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు.
రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు వారిగా కలుసుందామని చెప్పారు. తెలంగాణలోని సెటిలర్లు తెలంగాణ వారే అన్నారు. హైదరాబాదులోని సీమాంధ్రులు తెలంగాణ కోరుకుంటున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో వైషమ్యాలను రెచ్చగొట్టిందని మండిపడ్డారు. ఉద్యమంలో యువత, ఓయు, కెయు విద్యార్థుల పాత్ర మరువలేదనిదన్నారు.
జగన్ పార్టీపై ఫైర్
కొత్త పార్టీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి ఇప్పుడు సమైక్యమంటోందని మండిపడ్డారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి గతంలో తెలంగాణ కోసం ఢిల్లీకి పంపిన విషయం ఆ పార్టీకి తెలియదా చెప్పాలన్నారు. కాంగ్రెసు పార్టీ దయ వల్లనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారన్నారు. జెసి దివాకర్ రెడ్డి సైతం వైయస్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ రాష్ట్రంలో మరో నేతను ఎదగకుండా చేశారని, ఆ ఫలితం అనుభవిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications