సీమాంధ్ర రాజధానిపై దృష్టి: కేంద్రమంత్రుల లాబీయింగ్
హైదరాబాద్/న్యూఢిల్లీ: కేంద్రమంత్రివర్గం హైదరాబాదుతో కూడిన పది జిల్లా తెలంగాణకు అంగీకారం తెలపడంతో పలువురు సీమాంధ్ర నేతలు ఇప్పుడు కొత్త రాజధాని పైన దృష్టి సారించారు. విభజనను వ్యతిరేకిస్తున్నప్పటికీ, అనివార్యం కావడంతో ఎవరికి వారు విజయవాడ, విశాఖ, కర్నూలు ప్రాంతాలను రాజధానిగా చేయాలని గతకొంతకాలంగా లాబీయింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు తెలంగాణకు కేబినెట్ ఆమోదం లభించడంతో రాజధానిపై లాబీయింగ్ ఊపందుకుంది. కేంద్రమంత్రివర్గ ఆమోదంతో కీలక అధ్యాయం విభజనలో ముగిసింది. దీంతో ఇప్పుడు రాజధానిపై సీమాంధ్ర నేతలు దృష్టి పెట్టారు. శాసన సభలో, పార్లమెంటులో విభజన బిల్లును వ్యతిరేకించాలని దాదాపు సీమాంధ్ర నేతలు అందరూ ఒక్కమాటగా చెబుతున్నా, రాజధానిపై మాత్రం రగడ రాజుకుంటోంది.

గుంటూరు - విజయవాడ - తెనాలి ప్రాంతాల మధ్య రాజధాని ఉండాలని కొంతమంద్రి కేంద్రమంత్రులు ప్రతిపాదిస్తున్నారు. కిశోర్ చంద్రదేవ్ వంటి కేంద్రమంత్రి విశాఖపట్నాన్ని సీమాంధ్ర రాజధాని చేయాలని ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాచర్ల తదితర ప్రాంతాలను సూచిస్తున్నారు.
కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ కోసం పట్టుబడుతున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. ఇక కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వంటి వారు కర్నూలును రాజధాని చేయాలని డిమాండ్ చేస్తుండగా, ఒంగోలు - కావలిని మరికొందరు ప్రతిపాదిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో వాన్ పిక్ భూమి ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications