సీమాంధ్ర ఎంపిల రాజీనామలను తిరస్కరించిన స్పీకర్
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు చేసిన రాజీనామాలను లోక్సభ స్పీకర్ కార్యాలయం తిరస్కరించింది. రాజీనామలు చేసిన సీమాంధ్ర ఎంపీలు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పీకర్ కార్యాలయం కోరింది. ఎంపీలు రాయపాటి,బాపిరాజు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, హర్షకుమార్, కొనకళ్ల, వైయస్ జగన్లు, మరికొంత మంది ఎంపీలు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పీకర్ కార్యాలయం సూచించింది.
ఎంపీల రాజీనామాలపై ఒత్తిడులు ఉన్నాయా అని స్పీకర్ కార్యాలయం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. ఎంపీలు రాజీనామా చేయాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు చేసిన వ్యాఖ్యల సీడీని స్పీకర్ కార్యాలయం పరిశీలిస్తోంది.
రాజీనామలు ఇచ్చిన వెంటనే ఆమోదించాల్సిన అవసరం లేదని, ఆర్టికల్ 101(3బి) ప్రకారం పూర్తి స్థాయి విచారణ జరపొచ్చని, సమాచార సేకరణ కూడా చేయొచ్చని స్పీకర్ కార్యాలయం తెలిపింది. గతంలోనే స్పీకర్ మీరాకుమార్ను ఎంపీలు ఎస్పీవైరెడ్డి,సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్,అనంత వెంకట్రామిరెడ్డి ,సబ్బం హరి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ కలిసిని విషయం తెలిసిందే.
రాష్ట్ర విభజనపై కేంద్రం వైఖరికి నిరసనగా తాము స్పీకర్ ఫార్మెట్లోనే రాజీనామా చేశామని, వ్యక్తిగతంగా కూడా స్పీకర్ను కలిశామని అయినా రాజీనామాలు ఎందుకు తిరస్కరించారో తెలియదని పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ అన్నారు.