ఆఖరి అవకాశం: ఎంపీలు, మంత్రులపై అశోక్ బాబు
హైదరాబాద్: రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు సీమాంధ్ర ఎంపిలు, కేంద్ర మంత్రులకు ఆఖరి అవకాశం ఉందని, అది వారి పదవులకు రాజీనామా చేసి ప్రభుత్వానికి మద్దతును ఉపసహరించుకోవాలని ఏపిఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపిలు తమ పదవులకు రాజీనామా చేస్తే విభజన బిల్లు ఆగిపోయే అవకాశం ఉందని అన్నారు.రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడిన డిసెంబర్ 9 తెలుగుజాతికి విద్రోహ దినమని అన్నారు.
రాష్ట్ర విభజనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో సీమాంధ్రలో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రాజకీయాలు పక్కన పెట్టి అన్ని పార్టీల నాయకులు సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని అశోక్ బాబు కోరారు. రాష్ట్ర విడిపోయినా పరువాలేదనే నాయకులను చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారని అన్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. సమైక్య రాష్ట్ర ఉద్యమానికి తూట్లు పొడుస్తున్న నాయకులను శిక్షపడాల్సిందే అని ఆయన అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కొందరు నాయకులపై దాడి చేసి వారి వైఖరిని మార్చారని, కానీ అలా తాము చేయమని అశోక్ బాబు చెప్పారు. సమైక్య రాష్ట్రానికి కట్టుబడి లేని రాజకీయ నాయకుల దిష్టిబొమ్మలు, చిత్ర పటాలను వారి ఇళ్లు, కార్యాలయాల ముందు దగ్ధం చేయాలని సీమాంధ్ర ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. నవంబర్ 9న సమావేశమవుతామని, అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
ఒక వేళ తెలంగాణ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందితే సుప్రీం కోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. దానిపై కూడా సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉంటామన్న నాయకులు ఇప్పుడు సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సమైక్య రాష్ట్రానికి కట్టుబడని నాయకులను ఎన్నుకున్నందుకు సీమాంధ్ర ప్రజలు సిగ్గుపడుతున్నారని అన్నారు. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వస్తే దానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపించాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలను ఈ సందర్భంగా కోరారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే విభజన బిల్లు పెడితే ఉద్యమం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.