కేసు పెడితే: సమాధిపై చిరంజీవికి పయ్యావుల కౌంటర్
విద్యార్థుల జీవితాలకు సమాధులు కడితే నోరు మెదపని వారు సోనియా చిత్ర పటానికి సమాధి కడితే గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. పదమూడు జిల్లాల్లో ప్రతి గ్రామంలోను సోనియా చిత్ర పటాలకు సమాధులు కడతామని హెచ్చరించారు. సత్తా ఉంటే అసెంబ్లీకి తెలంగాణ బిల్లు పంపాలని సవాల్ చేశారు.
తమది రాగిముద్దల కోసం పోరాటమని, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుది బిర్యానీ కోసం ఆరాటమని ఎద్దేవా చేశారు. తిరుపతిలో సోనియా ఘాట్ నిర్మాణంపై విమర్శలు చేస్తున్న కేంద్రమంత్రులు, కాంగ్రెసు నేతలు విభజన జరుగుతుంటే, సీమాంధ్రకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారన్నారు.
ఇప్పుడు మాట్లాడుతున్న వారు సీమాంధ్ర ప్రయోజనాలకు సమాధి కట్టినప్పుడు మాట్లాడలేదన్నారు. కేసులు పెట్టాలన్న చిరంజీవి, ఇతర కాంగ్రెసు నేతల వ్యాఖ్యలపై స్పందిస్తూ... కేసులు నమోదయితే వారిని తెలుగు జాతి సంగ్రామ యోధులుగు సీమాంధ్ర సమాజం గుర్తిస్తుందన్నారు.
కేంద్రమంత్రులు పళ్లం రాజు, కావూరి సాంబశివ రావులను సమైక్యవాదులు, ప్రజలు తరిమారని, దీంతో మహిళా మంత్రులతో మాట్లాడిస్తున్నారని ఎద్దేవా చేశారు. మహిళా మంత్రులతో మాట్లాడిస్తూ విభజనపై ముందడుగు వేస్తున్నారని మండిపడ్డారు. తీర్మానం అసెంబ్లీకి రెండుసార్లు వచ్చేలా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చొరవ చూపాలన్నారు.