వైసీపీలోకి "సీమ" సీనియర్ నేత - బంపరాఫర్.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన నేత
రాయలసీమ ప్రాంతానికి చెందిన సీనియర్ నేత వైసీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది.
ఏపీలో పార్టీల జంపింగ్స్ ఊపందుకున్నాయి. ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ ప్రధాన పార్టీల్లోకి చేరికలు పెరుగుతున్నాయి. వైసీపీలోని కొందరు నేతలతో టీడీపీ టచ్ లో ఉందనే ప్రచారం సాగుతోంది. అదే సమయంలో టీడీపీ బీసీ నేతలకు వైసీపీ గాలం వేస్తోంది. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసిన సీనియర్ నేత..మాజీ ఎమ్మెల్యే ఏపీ అధికార పార్టీలో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలతో మనస్థాపానికి గురైన ఆయన..పార్టీ వీడాలని కొద్ది రోజుల క్రితం నిర్ణయించారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆ నేతకు వైసీపీ నుంచి ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక సమయంలో ఈ నేత చేరిక పైన వైసీపీలో చర్చ సాగుతోంది.
సీపీఎం సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే.. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ గఫూర్ వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. గఫూర్ సీపీఎం పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించినట్లుగా కొద్ది రోజుల క్రితమే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వెల్లడించారు. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన ఆయన అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నారు. తనను టార్గెట్గా చేసుకుని జరుగుతున్న పరిణామాల పట్ల గఫూర్ మనస్థాపంతో ఉన్నారు. తన రాజీనామా విషయాన్ని బహిరంగంగాప్రకటించకపోయినప్పటికీ.. సన్నిహితుల వద్ద మాత్రం స్పష్టం చేశారు. రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక సమయంలో పార్టీ సిద్ధాంతాలను, నియమావళిని ఉల్లంఘించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేసారు. గఫూర్ కర్నూలు నుంచి 1994, 2004లో ఎమ్మెల్యేగా వ్యవహరించారు.

ఇప్పుడు గఫూర్ ను వైసీపీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అంశాలు..రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న రాయలసీమ ప్రాంతానికి చెందిన మైనార్టీ నేత కావటంతో పార్టీలోకి రావటం ద్వారా మేలు జరుగుతందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. గఫూర్ అధికారికంగా వైసీపీలో చేరితే ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని చెప్పినట్లు సమాచారం. ఏపీలో వైసీపీ లో తొలి నుంచి సీపీఎం సఖ్యతగానే వ్యవహరిస్తోంది. సీపీఐ నేతలు ఓపెన్ గానే వైసీపీ ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారు. సీపీఎం నేతలు కొన్ని సందర్భాల్లో మినహా ప్రభుత్వాన్ని విమర్శించలేదు. ఇప్పుడు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ.. గఫూర్ చేరిక అంశం పైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే గఫూర్ మాత్రం ఇందులో నిజం లేదంటున్నారు. తాను సీపీఎం రాజకీయాలతోనే కొనసాగుతున్నానని క్లారిటీ ఇచ్చారు. వైసీపీలో చేరి..ఎమ్మెల్సీ పదవి తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోందని అందులో వాస్తవం లేదని చెబుతున్నారు. ఈ మేరకు ఆయన స్పష్టత ఇచ్చారు.












Click it and Unblock the Notifications