ఏబీ వెంకటేశ్వర రావుకు మళ్లీ షాక్: సస్పెన్షన్ పొడిగింపు?: సీఎస్ ఉత్తర్వులు జారీ?
అమరావతి: సీనీయర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలాన్ని జగన్ సర్కార్ మరోసారి పొడిగించినట్లు తెలుస్తోంది. మరో ఆరు నెలల పాటు ఆయన సస్పెన్షన్ను పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. పోలీస్ డైరెక్టర్ జనరల్ ర్యాంక్ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వర రావు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. అప్పట్లో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే కారణంతో జగన్ సర్కార్.. ఆయనను సస్పెండ్ చేసింది.
ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం: జగన్ సర్కార్కు అనుకూలంగా సుప్రీం: సస్పెన్షన్కు ఓకే
గత ఏడాది ఆగస్టు నుంచి ఆయన సస్పెన్షన్ మీదే ఉంటున్నారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఏబీ వెంకటేశ్వర రావు పనిచేశారు. ఆయన వ్యవహార శైలిపై అప్పటి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందేహాలను వ్యక్తం చేసింది. చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.
దీనిపై క్షేత్రస్థాయి నుంచి నివేదికను తెప్పించుకున్న కేంద్ర ఎన్నికల కమిషన్.. వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదులు నిజమేనని నిర్ధారించింది. ఇంటెలిజెన్స్ చీఫ్గా తప్పించింది. ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. ఏబీ వెంకటేశ్వర రావుకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన ట్రాక్ రికార్డ్ను పరిశీలించింది. విధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చింది.
2017-18లో పోలీసు శాఖ ఆధునికీకరణ కోసం టీడీపీ ప్రభుత్వం భద్రతా పరికరాలు కొనుగోలు చేసిన వ్యవహారంలో ఏబీ వెంకటేశ్వర రావు అక్రమాలకు పాల్పడినట్లు జగన్ సర్కార్ ధృవీకరించింది. దేశ రక్షణకు సంబంధించిన అంశం కావడంతో వల్ల ఆయనను సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్కు నివేదించింది. తన సస్పెన్షన్ను సవాల్ చేస్తూ వెంకటేశ్వర రావు హైకోర్టు, క్యాట్ను ఆశ్రయించినప్పటికీ.. ప్రతికూల ఫలితాలే ఎదురయ్యాయి. ఆయన విషయంలో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని క్యాట్, హైకోర్టు సమర్థించాయి. అప్పటి నుంచి ఆయన సస్పెన్షన్ మీదే ఉంటున్నారు. తాజాగా మరోసారి ఆయన సస్పెన్షన్ కాలాన్ని పొడిగించినట్లు సమాచారం.