చింతకాయల విజయ్ కేసులో ట్విస్టులు-టీఎస్ పోలీసులు నో-చైల్డ్ రైట్స్ కమిషన్ కు టీడీపీ ఫిర్యాదు
ఏపీ టీడీపీ సీనియర్ నేత అయన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కేసులో రోజుకో ట్విస్టు చోటు చేసుకుంటోంది. సీఎం జగన్ సతీమణి భారతిపై అనుచిత పోస్టు పెట్టిన వ్యవహారంలో ఏపీసీఐడీ పోలీసులు హైదరాబాద్ లోని విజయ్ నివాసంలో నిర్వహించిన సోదాలు కలకలం రేపుతున్నాయి. ఇందులో ఏపీసీఐడీ మాత్రం తాము నోటీసులు ఇచ్చేందుకే వెళ్లామని చెబుతుంటే కుటుంబ సభ్యులు, చిన్నపిల్లల్ని భయభ్రాంతులకు గురిచేశారంటూ టీడీపీ తెలంగాణ పోలీసుల్ని, బాలల హక్కుల కమిషన్ ను ఆశ్రయిస్తోంది.

చింతకాయల విజయ్ కేసు
ఏపీ టీడీపీ సోషల్ మీడియా విభాగం ఐటీడీపీ కో కన్వీనర్ గా ఉన్న చింతకాయల విజయ్ సీఎం జగన్ సతీమణి భారతి పేరుతో పెట్టిన భారతీపే పోస్టు ఇప్పుడు కలకలం రేపుతోంది. దీన్ని సీరియస్ గా తీసుకున్న వైసీపీ సర్కార్ సీఐడీ సాయంతో నోటీసులు ఇప్పించింది. విచారణకు రావాలని కోరేందుకు నోటీసులతో హైదరాబాద్ లోని విజయ్ నివాసానికి వెళ్లిన సీఐడీ పోలీసుల వ్యవహారశైలి ఇప్పుడు వివాదాస్పదమైంది. విజయ్ నివాసంలో సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరుపై టీడీపీ తీవ్ర అభ్యంతరాలు చెబుతూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తోంది.

ఏపీసీఐడీపై కేసు తీసుకోని తెలంగాణ పోలీసులు
హైదరాబాద్ లోని చింతకాయల విజయ్ నివాసంలో ఏపీసీఐడీ పోలీసుల వ్యవహారశైలిపై తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. అయితే జూబ్లీహిల్స్ పోలీసులు మాత్రం కేసు తీసుకోలేదు. దీంతో టీడీపీ నేతలు అక్కడే ధర్నాకు కూడా దిగారు. ఏపీసీఐడీ పోలీసుల దురుసు ప్రవర్తనపై కేసు తీసుకునేందుకు తెలంగాణ పోలీసులు నిరాకరించడంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో స్టేషన్ వద్ద పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ టీడీపీ నేతల్ని నిర్బంధించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

చైల్డ్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు
ఏపీసీఐడీ పోలీసులు చింతకాయల విజయ్ నివాసంలో వ్యవహరించిన తీరుపై టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదును తెలంగాణ పోలీసులు తీసుకోకపోవడంతో తాజాగా అక్కడి చైల్డ్ రైట్స్ కమిషన్ ను వారు ఆశ్రయిస్తున్నారు. ఈ మేరకు
ఏపీ సీఐడీ పోలీసులుగా చెబుతున్న నలుగురు వ్యక్తులపై తెలంగాణ చైల్డ్ రైట్స్ కమిషన్ కు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 1న ఏపీ సీఐడీ పోలీసులు చింతకాయల విజయ్ నివాసానికి వచ్చి ఫ్లాట్లోకి బలవంతంగా ప్రవేశించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయ్ 5 ఏళ్ల కుమార్తెను మీ నాన్న ఎక్కడని
పదే పదే ప్రశ్నించి, భయభ్రాంతులకు గురిచేసి తీవ్ర మానసిక వేధింపులకు గురిచేశారని వర్ల ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఐదేళ్లు, రెండేళ్లు వయస్సున్న పిల్లల ఫోటోలను సీఐడీ పోలీసులు తీసుకెళ్లారన్నారు. పోలీసులు ప్రశ్నించడంతో చిన్నారుల మానసిక వేదనకు గురయ్యారని ఫిర్యాదులో తెలిపారు. పిల్లలతో అనుచితంగా ప్రవర్తించిన ఏపీ సీఐడీ పోలీసులుగా చెబుతున్న నలుగురిపై చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

గతంలో రఘురామ కేసులోనూ..
గతంలో రఘురామకృష్ణంరాజు ఇంట్లో ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ తచ్చాడుతుండగా.. ఆయన అనుచరులు పట్టుకుని కొట్టారు. ఈ వ్యవహారంలోనూ ఏపీ పోలీసులపై రఘురామ తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేస్తే, తమ కానిస్టేబుల్ ను కొట్టారని ఏపీ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు.ఈ వ్యవహారం కాస్తా తెలంగాణ హైకోర్టు వరకూ వెళ్లింది. ఆ తర్వాత రఘురామపై తీవ్ర చర్యలు తీసుకోవద్దంటూ న్యాయస్ధానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ వ్యవహారం సద్దుమణిగిందని భావిస్తున్న తరుణంలో ఇప్పుడు చింతకాయల విజయ్ వ్యవహారం తెలంగాణ పోలీసులకు తలనొప్పిగా మారుతోంది.












Click it and Unblock the Notifications