అమరావతిలో జగన్కు వరుస షాక్లు- దర్యాప్తు సంస్ధల వైఫల్యం- లోపం ఎక్కడంటే ?
ఏపీలో రాజధాని అమరావతి నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగిందని వైసీపీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. అధికారం చేపట్టాక మంత్రివర్గ ఉపసంఘంతో పాటు సీఐడీ, ఏసీబీ విచారణలు చేయించింది. ఓ దశలో సీబీఐ, ఈడీ దర్యాప్తు కూడా కోరింది. కానీ రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకూ ఓ భారీ స్కామ్ జరిగిందని నిరూపించే గట్టి ఆధారాలు సంపాదించడంలో మాత్రం దర్యాప్తు సంస్ధలు విఫలమయ్యాయి. దీంతో అమరావతి స్కాం జరిగిందని కచ్చితంగా చెప్పేందుకు ఇప్పటికీ వైసీపీ సర్కారు తడబడుతోంది. చివరికి అసలు కుంభకోణాన్ని వెలికితీయాల్సిన దర్యాప్తు సంస్ధలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అట్రాసిటీ కేసులకే పరిమితం కావాల్సిన పరిస్ధితి.
తిరుపతిలో వైసీపీ గెలుపు దేశం చూడాలి- అతి విశ్వాసం వద్దు- జగన్ వ్యాఖ్యలు
అమరావతిలో కుంభకోణం వెతుకుతున్న జగన్ సర్కార్
అమరావతి రాజధాని ఎంపిక, నిర్మాణం విషయంలో అసలు కుంభకోణం జరిగిందా లేదా అనే అంశంపై వైసీపీ సర్కారు ఎటూ తేల్చుకోలేకపోతోంది. రెండేళ్ల క్రితం రాజధానిలో భారీ స్కాం అంటూ తీవ్ర విమర్శలు చేసి ఇతర ప్రాంతాల్లో ఓట్లు కొల్లగొట్టిన వైసీపీ ఇప్పుడు దాన్ని నిరూపించేందుకు రెండేళ్ల సమయం దొరికినా ఏమీ చేయలని పరిస్ధితి ఎదురవుతోంది. అలాగని అమరావతిలో అస్సలు అక్రమాలే లేవని చెప్పే పరిస్ధితి లేదు. కానీ వాటిని నిరూపించడంలో మాత్రం ఘోర వైఫల్యం. దీంతో వైసీపీకి ఇప్పుడు ఆరోపణలకూ, నిరూపణకూ మధ్య వ్యత్యాసం తెలిసొస్తోంది.
దర్యాప్తు సంస్ధల వైఫల్యమా ? సర్కారుదేనా
అమరావతిలో రెండేళ్ల వరుస దర్యాప్తులు, విచారణలు, కోర్టు కేసుల తర్వాత కూడా వాస్తవాలు వెలికి తీసి కుంభకోణం జరిగినట్లు నిరూపించడంలో ప్రభుత్వం విఫలమైంది. మంత్రివర్గ ఉపసంఘం నిర్ధారించిన ఆరోపణలను వాస్తవాలుగా నిరూపించేందుకు సీఐఢీ, ఏసీబీ వంటి సంస్ధలు క్షేత్రస్దాయిలో రంగంలోకి దిగినా వాస్తవ పరిస్ధితులు వేరుగా ఉండటంతో దూకుడుగా ముందుకెళ్లలేని పరిస్ధితి. దీంతో కోర్టుల్లో ఒక్కో కేసూ నీరుగారిపోతున్నాయి. చివరికి రాజధాని ఎంపికలో జరిగినట్లు చెప్పిన ఇన్సైడర్ ట్రేడింగ్తో పాటు భూముల బదలాయింపు, అమ్మకాల విషయంలోనూ దర్యాప్తు సంస్ధలు చేతులెత్తేస్తున్న పరిస్ధితి. దీంతో ప్రభుత్వ ఒత్తిడితో రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్ధలు చేసేది లేక చిన్నా చితకా కేసులకు పరిమితం కావాల్సి వస్తోంది.
ఇన్సైడర్ ట్రేడింగ్ నుంచి అట్రాసిటీ కేసుల వరకూ
రాజధాని ఎంపికలో తన వారికి న్యాయం చేసేందుకు అప్పటి సీఎం చంద్రబాబు టీడీపీ నేతలకు ముందుగానే సమాచారం ఇచ్చి భూములు కొనిపించారని వైసీపీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. ఇన్సైడర్ ట్రేడింగ్గా పేర్కొంటున్న ఈ వ్యవహారాన్ని హైకోర్టు తాజాగా కొట్టేసింది. ఆ తర్వాత భూముల అమ్మకాలు, బదలాయింపుల వ్యవహారాల్లోనూ దర్యాప్తు సంస్ధలు గట్టి ఆధారాలు సంపాదించలేకపోయాయి. దీంతో అమరావతిలో అసలు కుంభకోణం జరిగిందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్, భూముల అమ్మకంపై కేసులు పెట్టిన దర్యాప్తు సంస్ధలు చివరికి అట్రాసిటీ కేసుల వరకూ వచ్చేశాయి. తద్వారా అసలు స్కాం దొరకలేదు కాబట్టి కనీసం అట్రాసిటీ కేసులు పెట్టి ఏదో ఒకటి నిరూపించామని చెప్పుకునేందుకు వైసీపీ సర్కారు ప్రయత్నిస్తోంది. అందులోనూ తడబాట్లే. దళిత ఎమ్మెల్యే కాకపోయినా స్ధానిక ప్రజాప్రతినిధి పేరుతో ఎమ్మెల్యే ఆర్కేతో చంద్రబాబు, నారాయణపై అట్రాసిటీ కేసులు పెట్టించిన ప్రభుత్వం.. ఇప్పుడు హైకోర్టు దాన్నీ అంగీకరించకపోవడంతో ఎదురుదెబ్బ తప్పలేదు.
అమరావతిలో ఇరుక్కున్న జగన్ సర్కార్
అమరావతి విషయంలో భారీ స్కాం జరిగిందంటూ వరుస దర్యాప్తులకు ఆదేశిస్తున్నా అందులో దొరికిన అంశాలు ఏ ఒక్కటీ భారీ కుంభకోణాన్ని నిర్ధారించే స్ధాయిలో లేకపోవడంతో ఇప్పుడు టీడీపీ కంటే వైసీపీయే ఎక్కువగా కూరుకుపోతున్నట్లు అర్ధమవుతోంది. ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి. మరో మూడేళ్లలో అమరావతిలో ఏమీ తేల్చలేకపోతే ఇతర ప్రాంతాల్లో జనం సైతం ఈ ఆరోపణల్ని నమ్మలేని పరిస్ధితి తలెత్తడం కాయంగా కనిపిస్తోంది. అటు కేంద్ర దర్యాప్తు సంస్ధల దర్యాప్తు కోరినా స్పందన లేకపోవడం వెనుక అమరావతిలో లభించిన ప్రాధమిక సమాచారమే అని తెలుస్తోంది. రాష్ట్ర దర్యాప్తు సంస్ధలైన సీఐడీ, ఏసీబీ కనీస ప్రాధమిక ఆధారాల్ని సంపాదించలేని అమరావతి స్కాంపై తాము రంగంలోకి దిగితే పరువుపోగొట్టుకోవడం ఖాయమని కేంద్రం కూడా భావిస్తోంది.
అసలు లోపం ఎక్కడుంది ?
అమరావతి రాజధాని ఏర్పాటు సందర్భంగా టీడీపీ నేతలతో పాటు భారీ ఎత్తున స్ధానికులు కూడా లబ్ధి పొందారు. ఇందులో దళితులతో పాటు మిగతా అన్ని సామాజిక వర్గాలు కూడా ఉన్నాయి. సీఆర్డీయే చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించినప్పుడు కూడా అందులో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని దర్యాప్తు సంస్ధలు, కోర్టులు ప్రశ్నించలేవని స్పష్టంగా ఉంది. దీంతో ఇప్పుడు ఆ నిబంధనే వైసీపీ సర్కారు ఆశల్ని ఆవిరి చే్స్తోంది. దర్యాప్తు సంస్ధల్ని దూకుడుగా ముందుకు వెళ్లనీయకుండా చేస్తోంది. ఇప్పటికే సీఆర్డీయే చట్టాన్ని వైసీపీ సర్కారు రద్దు చేస్తూ అసెంబ్లీలో బిల్లుల్ని ఆమోదించినా అవి హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. సీఆర్డీయే చట్టం రద్దయితే తప్ప అమరావతిలో చాలా మటుకు అక్రమాల్ని ప్రశ్నించలేని పరిస్ధితి. దీంతో ప్రభుత్వం కూడా అదను కోసం వేచి చూడక తప్పని పరిస్ధితి కనిపిస్తోంది.