బోరుగడ్డ అనిల్ కు సుప్రీంకోర్టు షాక్- బెయిల్ పై కీలక ఆదేశం..!
ఏపీలో వైసీపీ సానుభూతిపరుడు, ఆ పార్టీ అధికారంలో ఉండగా కూటమి పార్టీల నేతలపై తీవ్ర స్ధాయిలో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్ కు ఇప్పుడు వరుస ఎదురుదెబ్బలు తప్పడం లేదు. గతంలో తన తల్లికి అనారోగ్యం పేరుతో బెయిల్ తీసుకున్న బోరుగడ్డ అనిల్ కుమార్ దాని పొడిగింపు కోసం కోర్టుకు సమర్పించిన సర్ఠిఫికెట్ అంటూ పోలీసులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన పెట్టుకున్న కొత్త బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఎటూ తేల్చడం లేదు. దీనిపై బోరుగడ్డ సుప్రీంను ఆశ్రయించారు.
తన బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపేలా ఏపీ హైకోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బోరుగడ్డ అనిల్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. అయితే ఈ వ్యవహారంలో హైకోర్టుకు ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు బోరుగడ్డకు తేల్చిచెప్పేసింది. నకిలీ మెడికల్ సర్టిఫికెట్ పెట్టి బెయిల్ పొడిగించుకున్న వ్యవహారం తేలే వరకూ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో బోరుగడ్డకు షాక్ తప్పలేదు.

బోరుగడ్డ అనిల్ సమర్పించిన నకిలీ ధృవపత్రాల ఆధారంగా బెయిల్ ఇచ్చారా లేదా అన్న విషయం తేలకుండా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపితే ఆ ప్రభావం దీని మీద పడుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేవీ విశ్వనాథన్ తెలిపారు. అందుకే ఆ ధృవపత్రాలపై హైకోర్టు నివేదిక కోరినట్లు వెల్లడించారు. అయితే చివరిగా బోరుగడ్డ బెయిల్ పిటిషన్ పై సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపి నిర్ణయం ప్రకటించాలని మాత్రం మరో జడ్జి జస్టిస్ నాగరత్న ఏపీ హైకోర్టును ఆదేశించారు. దీంతో త్వరలో బోరుగడ్డ బెయిల్ వ్యవహారంపై ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications