రాజద్రోహంపై జగన్ సర్కార్కు మళ్లీ చుక్కెదురు -జడ్జి రామకృష్ణకు బెయిల్-రఘురామ బాటలో
ఏపీలో ప్రభుత్వం, సీఎం జగన్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న కారణంతో రాజద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న చిత్తూరు జిల్లా జడ్డి రామకృష్ణకు ఇవాళ హైకోర్టులో ఊరట లభించింది. రామకృష్ణకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో రాజద్రోహం కేసుల్లో వైసీపీ ప్రభుత్వానికి రెండోసారి ఎధురుదెబ్బ తగిలినట్లయింది. గతంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై దాదాపు ఇవే ఆరోపణలతో సీఐడీ నమోదు చేసిన రాజద్రోహం కేసుపై సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది.
జడ్జి రామకృష్ణకు హైకోర్టు బెయిల్
చిత్తూరు జిల్లాకు చెందిన సెషన్స్ జడ్డి రామకృష్ణకు గతంలో ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్పై ఓ న్యూస్ ఛానల్లో చర్చ సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు రాజద్రోహం సెక్షన్ 124ఏ కింద కేసులు పెట్టారు. దీనిపై ఆయన మూడు నెలలుగా జైల్లోనే ఉన్నారు. ఓ దశలో ఆయన బెయిల్పై బయటికెళితే ప్రాణహాని ఉంటుందంటూ కస్టడీలోనే ఉండటం మంచిదని హైకోర్టు సూచించింది. ఎట్టకేలకు సహజ న్యాయసూత్రాలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం బెయిల్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో ఆయనకు హైకోర్టు ఊరటనిచ్చింది.
జడ్జి రామకృష్ణ బెయిల్కు హైకోర్టు షరతులివే
జడ్జి రామకృష్ణ బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా హైకోర్టు కొన్ని షరతులు విధించింది. 50 వేల రూపాయలు పూచీకత్తు సమర్పించి బెయిల్ తీసుకోవచ్చని హైకోర్టు ఆయనకు సూచించింది. అలాగే బెయిల్పై బయటికి వచ్చిన తర్వాత విచారణాధికారికి సహకరించాలని ఆదేశించింది. అలాగే ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడొద్దని కూడా జడ్డి రామకృష్ణను హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆయన త్వరలో బెయిల్ షరతులు పూర్తి చేసి జైలు నుంచి విడుదల కానున్నారు.
రాజద్రోహంపై జగన్ సర్కార్కు మరో ఎదురుదెబ్బ
ఏపీలో ప్రభుత్వం, సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజద్రోహం కేసులు పెడుతున్న సర్కార్కు ఈ కేసులో హైకోర్టు తీర్పు ఎదురుదెబ్బగా మారింది. బెయిల్ రాకూడదనే ఉద్దేశంతో మోపుతున్న రాజద్రోహం సెక్షన్ 124ఏ విషయంలో హైకోర్టు విచారణ జరిపి బెయిల్ మంజూరు చేయడాన్ని బట్టి చూస్తే ఈ అభియోగాలపై కోర్టుల స్పందన అర్ధమవుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే వ్యాఖ్యలు, విమర్శలు రాజద్రోహం కిందకు రావని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా హైకోర్టు ఈ తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది.
రఘురామ బెయిల్ తీర్పు రిపీట్
జడ్డి రామకృష్ణపై ఏపీ ప్రభుత్వం మోపిన రాజద్రోహం ఆరోపణల కేసులో ఆయనకు బెయిల్ లభించడాన్ని బట్టి చూస్తే గతంలో ఇదే విధంగా బెయిల్ పొందిన రఘురామకృష్ణంరాజు వ్యవహారం గుర్తుకు రాకమానదు. రఘురామపై ఏపీ సీఐడీ మోపిన రాజద్రోహం ఆరోపణలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు జడ్జి రామకృష్ణ కేసులోనూ దాదాపు ఇదే తీర్పు రావడంతో రాజద్రోహం అభియోగాల నమోదు విషయంలో ఏపీ ప్రభుత్వం వైఖరి చర్చనీయాంశమవుతోంది.