జగన్ సర్కార్ కు కేంద్రం షాక్-ఒక్క రాజధానికే నిధులు-మూడు రాజధానుల బిల్లు వేళ...
ఏపీలో రాజధానుల రచ్చ పెరుగుతోంది. అమరావతి రాజధానిని కాపాడుకోవడానికి రైతులు రోడ్డెక్కారు. అరసవిల్లికి పాదయాత్ర చేపట్టారు. అదే సమయంలో అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమమవుతోంది. ఇలాంటి తరుణంలో కేంద్రం ఇవాళ ఓ షాకిచ్చింది. ఏపీలో ఏకైక రాజధాని కోసం మాత్రమే నిధులిస్తామని మరోసారి ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. దీంతో ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులో ఏమైనా మార్పులు చేస్తుందా లేదా అన్నది స్పష్టం కావాల్సి ఉంది.
అమరావతి వర్సెస్ మూడు రాజధానులు
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా రాజధానుల చర్చే కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ప్రభుత్వం మూడు రాజధానుల్ని అమల్లోకి తీసుకొస్తుందా లేక హైకోర్టు తీర్పు ప్రకారం అమరావతినే రాజధానిగా అంగీకరించి పాలన సాగిస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. రాజధాని అమరావతి రైతులు పాదయాత్ర ప్రారంభించడంతో దానికి కౌంటర్ గా మంత్రులు రోజురోజుకీ స్వరం పెంచుతున్నారు. దీంతో రాజధాని వ్యవహారం రాబోయే అసెంబ్లీ సమావేశాల్ని కుదిపేసేలా కనిపిస్తోంది.
జగన్ సర్కార్ కు కేంద్రం షాక్
ఏపీలో రాజధాని రచ్చ నడుస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వానికి ఓ షాకిచ్చింది. రాజధానుల విషయంలో ఇప్పటికే వైసీపీ సర్కార్ కు సహకరించడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్రం.. ఇప్పుడు త్వరలో జరిగే హోంశాఖ భేటీలోనూ ఏపీ రాజధాని పేరుతోనే చర్చ కొనసాగించేలా కనిపిస్తోంది. ఇందుకు తగినట్లుగానే ఏపీలో రాజధాని అంటూ ప్రస్తావిస్తూ నిధుల విడుదలను అజెండాలో చేర్చింది. దీంతో ఈ వ్యవహారం కాస్తా అమరావతి రాజధానికి ఇదో గుడ్ న్యూస్ గానూ, జగన్ సర్కార్ కు బ్యాడ్ న్యూస్ గానూ మారినట్లు కనిపిస్తోంది.
ఒక్కరాజధానికే నిధులు
ఈ నెల 27న ఢిల్లీలో ఏపీ-తెలంగాణ మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ కీలక భేటీ నిర్వహిస్తోంది. ఇందులో ఏపీ రాజధానికి నిధులు కేటాయించే అంశాన్ని అజెండాలో చేర్చుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇవాళ విడుదలైన ఈ అజెండాలో ఏపీలో ఏకైక రాజధానికి నిధులు సహా పలు అంశాల్ని కేంద్రం చేర్చింది. అయితే మిగతా అంశాలు ఎప్పుడూ ఉండేవే కాబట్టి, రాజధాని అంశం మాత్రం రాజకీయంగా మరో రచ్చకు కారణమవుతోంది. కేంద్రం ఏకైక రాజధాని అని ప్రస్తావించడం వెనుక ఉన్న కారణాలపై అంతా ఆరా తీసే పనిలో ఉన్నారు.
మూడు రాజధానుల బిల్లు వేళ ఝలక్ ?
ఏపీలో ఎల్లుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఐదు రోజుల పాటు సాగే సమావేశాల్లో అమరావతి తో పాటు మూడు రాజధానులపై మరోసారి చర్చ పెట్టి కీలక బిల్లును ఆమోదింపజేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి కీలక సమయంలో కేంద్ర హోంశాఖ సమావేశం అజెండాలో ఏకైక రాజధానికి నిధులంటూ కేంద్రం చేసిన ప్రకటన కాక రేపేలా ఉంది. కేంద్రం హోంశాఖ భేటీ అజెండాలోఏకైక రాజధానికి నిధులంటూ ప్రస్తావించిన నేపథ్యంలో వైసీపీ సర్కార్ స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఇప్పటికే సాంకేతిక కారణాలతో అమరావతినే రాజధాని ఉంచి, మరో రెండు రాజధానుల్ని వేసవి, శీతాకాల రాజధానులుగా మార్చే అవకాశం ఉందన్న ప్రచారం కూడా ఉంది. ఇలాంటి తరుణంలో కేంద్రం ఏకైక రాజధానికి నిధులిస్తే అవి ఎక్కడ ఖర్చుపెట్టాలన్న దానిపైనా సందిగ్ధత నెలకొంది.