ఏపీ కొత్త జిల్లాలకు కేంద్రం బ్రేక్ ?-వ్యాక్సినేషన్, జనగణన జాప్యంతో-జూన్ తర్వాతే ప్రక్రియ !
ఏపీలో కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో కేంద్రం చేపట్టే జనగణన ప్రభావం దీనిపై పడేలా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా జనగణన పూర్తి కాకుండా జిల్లాల సరిహద్దుల్ని మార్చొద్దంటూ గతంలో ఆదేశాలు జారీ చేసిన కేంద్రం.. తాజాగా దీనిపై మరోసారి రాష్ట్రాలకు క్లారిటీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కోవిడ్ వ్యాక్సినేషన్ కారణంగా జనగణన ఆలస్యం అవుతున్న నేపథ్యంలో జిల్లాల సరిహద్దుల మార్పుపై రాష్ట్రాలకు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆ మేరకే రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు సమాచారం
ఏపీ కొత్త జిల్లాలు
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు అభ్యంతరాలను స్వీకరిస్తోంది. 13 జిల్లాల స్ధానంలో 26 జిల్లాలు ఏర్పాటు చేయడంతో పాటు పలు జిల్లాలకు కొత్తగా పేర్లు మారుస్తూ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై ఇప్పటికే పలు అభ్యంతరాలు వ్యక్తమవుతుండగా.. కేంద్రం కూడా ఇప్పటికే దీనిపై అభ్యంతరం చెబుతున్నట్లు తెలుస్తోంది.
కొత్త జిల్లాలకు కేంద్రం బ్రేక్ వేస్తుందా ?
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆలస్యంగా జనగణన చేపడుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తేలా ఉన్నాయి. జిల్లాల భౌగోళిక సరిహద్దుల మార్పు ద్వారా జనగణనపై ప్రభావం పడనుంది. కేంద్ర జనగణనశాఖ డైరెక్టర్ ఈ మేరకు ఈ జూన్ వరకూ జిల్లాల సరిహద్దులు మార్చకుండా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు జనగణనశాఖ డైరెక్టర్ లేఖ రాసినట్లు తెలుస్తోంది. జనగణన పూర్తి కాకుండా జిల్లాల సరిహద్దులు మారిస్తే ఇబ్బందులు తప్పవని కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.
కోవిడ్ వ్యాక్సినేషన్ ఎఫెక్ట్
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కేంద్రం జనగణన ప్రక్రియతో దీన్ని ముడిపెట్టడం వెనుక వ్యాక్సినేషన్ కూడా కారణంగా మారుతోంది. ఎందుకంటే ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండటంతో జనగణన నానాటికీ ఆలస్యమవుతోంది. ఈ ప్రక్రియపూర్తయితే కానీ జనగణన చేపట్టేందుకు వీల్లేదు. దీంతో కోవిడ్ వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేయాలని కేంద్రం కోరుతోంది. అది పూర్తయ్యాక జనగణన చేపట్టి జూన్ కల్లా దీన్ని పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత మాత్రమే జిల్లాల సరిహద్దుల్ని మార్చేందుకు వీలు దొరుకుతుంది
జూన్ తర్వాతే కొత్త జిల్లాలు ?
ఈ ఏడాది ఏప్రిల్ 2న ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం పావులు కదుపుతోంది. కానీ ఇప్పుడు కేంద్రం జనగణన సందర్భంగా జూన్ వరకూ జిల్లాల సరిహద్దుల్ని మార్చకుండా ఆంక్షలు విధిస్తోంది. దీంతో ఈ ప్రక్రియ ఉగాది నాటికి పూర్తి కావడం కష్టమేనని తెలుస్తోంది.. కేంద్రం ఆదేశాల మేరకు జూన్ లో జనగణన పూర్తయిన తర్వాతే కొత్త జిల్లాలపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ప్రక్రియ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో తాత్కాలికంగా జిల్లాల ఏర్పాటుకు బ్రేక్ పడొచ్చనే ప్రచారం జరుగుతోంది.