ఏబీ సస్పెన్షన్ కొనసాగింపుపై సుప్రీం అభ్యంతరం-ఇరుకునపడ్డ ఏపీ సర్కార్-కేంద్రం పేరు చెప్పి
ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అక్రమంగా నిఘా పరికరాలు కొనుగోలు చేసి గూఢచర్యం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరావుకు సుప్రీంకోర్టులో ఇవాళ కొంత ఊరట లభించింది. ఏబీపై వైసీపీ సర్కార్ విధించిన సస్పెన్షన్ రెండేళ్లు దాటినా ఇంకా తొలగించకపోవడంపై సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
ఏపీలో గతంలో ఇంటిలిజెన్స్ ఛీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరావు తన పదవీకాలంలో ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలు కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే ఆయన్ను సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఆయన సస్పెన్షన్ లోనే ఉన్నారు. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అఖిల భారత సర్వీసు అధికారులను రెండేళ్లకు పైగా సస్పెన్షన్ లో ఉంచడం చట్ట విరుద్ధమని వాదించారు. దీనిపై సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ఏపీ ప్రభుత్వం కేంద్రం నుంచి నిబంధనలపై క్లారిటీ కోరామని తెలిపింది. అయితే ఈ సమాదానంపై సుప్రీం సంతృప్తి చెందలేదు.

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సస్పెన్షన్ ఎంతకాలం కొనసాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్ చేయకూడదన్న నిబంధనలు గమనించాలని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి సూచించింది.
అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన నిర్దేశాలు కోరామని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీనిపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశాలు అడుగుతారా అని ప్రశ్నించింది. రేపటిలోగా అన్ని వివరాలతో రావాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది.రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ కొనసాగించాలన్న వాదనలకు ఆధారాలు చూపాలని ఆదేశాలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications