జగన్ సర్కార్ కు సుప్రీం షాక్-రుషికొండలో నిర్మాణాలకు బ్రేక్-హైకోర్టులో బంతి
ఏపీలోని విశాఖపట్నంలో ఉన్న రుషికొండలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన తవ్వకాల వ్యవహారం సుప్రీంకోర్టులో కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో విచారణ జరిపిన ఎన్టీటీ తొలుత స్టే ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై హైకోర్టును ఆశ్రయిచకుండా నేరుగా సుప్రీంకోర్టుకు వచ్చిన వైసీపీ సర్కార్ కు అత్యున్నత న్యాయస్ధానం ఝలక్ ఇచ్చింది. ఈ వ్యవహారం హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది.
ఎన్టీటీలో జరుగుతున్న రుషికొండ తవ్వకాల విచారణను సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు.. ఓవైపు ఎన్టీటీ,మరోవైపు హైకోర్టు విచారణ జరిపితే గందరగోళం తప్పదని తెలిపింది. దీంతో ఎన్టీటీలో విచారణను ఆపడంతో పాటు ఏపీ ప్రభుత్వాన్ని సైతం హైకోర్టులోనే ఈ వ్యవహారం తేల్చుకోవాలని సుప్రీం సూచించింది. అలాగే ఎన్టీటీ కంటే హైకోర్టే అత్యున్యతమని కూడా స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు రుషికొండ తవ్వకాల వ్యవహారం ఏపీ హైకోర్టులో విచారణకు రానుంది.
రుషికొండ తవ్వకాల వ్యవహారంలో సుప్రీంకోర్టు మరిన్ని కీలక ఆదేశాలు కూడా ఇచ్చింది. హైకోర్టులో ఈ వ్యవహారం తేలేంత వరకూ కొత్తగా తవ్వకాలు చేపట్టరాదని ఆదేశించింది. పాత రిసార్ట్ ఉన్న ప్రాంతంలో మాత్రమే కొత్త నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. రుషికొండలో తవ్వకాలు జరిగిన ఫొటోల్ని సుప్రీంకోర్టు ముందు రఘురామ న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ సమర్పించారు. వీటిని పరిశీలించిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.