పవన్ కళ్యాణ్ కు హైకోర్టు షాక్- జనసేన కార్యకర్తలపై ఎఫ్ఐఆర్ రద్దుకు నో-సర్కార్ కు నోటీసు
ఏపీలో విశాఖ ఎయిర్ పోర్టు ఘటన రేపుతున్న కలకలం చూస్తూనే ఉన్నాం. ఈ ఘటనలో వైసీపీ మంత్రులపై జనసేన కార్యకర్తలు దాడి చేయడం, అనంతరం పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం,వీరిలో కొందరికి బెయిల్ లభించడం చకచకా జరిగిపోయాయి. అయితే మిగిలిన వారిపై సైతం పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని కోరుతూ జనసేన హైకోర్టును ఆశ్రయించింది.
జనసేన దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఎఫ్ఐఆర్ లో నిందితుడిగా పోలీసులు చూపించిన వ్యక్తి కాకుండా మరొకరు పిటిషన్ దాఖలు చేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. విచారణ తర్వాత వీరిపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను కొట్టేసేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో జనసేన పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో వైజాగ్ ఎయిర్ పోర్టు ఘటనలో అరెస్టైన జనసేన కీలక నేతలపై కేసులు కొనసాగనున్నాయి.
మరోవైపు వైజాగ్ ఎయిర్ పోర్టు ఘటనకు దారి తీసిన పరిస్దితులపై ఏపీ ప్రభుత్వం సమగ్రంగా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం మరోసారి ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామని ప్రకటించింది. వైజాగ్ ఘటన తర్వాత అరెస్టు చేసిన నిందితుల్ని ఇప్పటికే పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. వీరిలో కొందరికి బెయిల్ లభించింది. దీంతో మిగిలిన వారిని రిమాండ్ కు పంపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపితే జనసేన కార్యకర్తల్ని వైసీపీయే రెచ్చగొట్టిన్నట్లు జనసేన ఆరోపిస్తోంది.