తిరుపతిలో వైసీపీకి డబుల్ షాక్- రాళ్ల దాడిపై ఈసీ దర్యాప్తు-వాలంటీర్లకు చెక్
తిరుపతి ఉపఎన్నికలో వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రచారంలో బాగంగా చోటు చేసుకున్న ఘటనలు, విపక్ష టీడీపీ ఫిర్యాదులు, వాటిపై ఈసీ స్పందనతో పోలింగ్కు ఒక్క రోజు ముందు కూడా ఉపఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఉపఎన్నికలో చోటు చేసుకున్న ఘటనలపై టీడీపీ ఎంపీలు చేసిన పలు ఫిర్యాదులపై స్పందించిన ఈసీ... పలు కీలక చర్యలు ప్రకటించంది. దీంతో ఇవి అధికార వైసీపీకి ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తిరుపతి ఘటనలపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు
తిరుపతిలో ఈ నెల 17న జరగాల్సిన ఉపఎన్నికకు ముందు చోటు చేసుకున్న పలు ఘటనలు, వాటి పర్యవసానాలు, ఎన్నికల పోలింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీడీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉన్న వాలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలని, పోలింగ్లో అక్రమాలకు తావు లేకుండా కేంద్ర బలగాలను దించాలని టీడీపీ ఎంపీలు ఈసీని కోరారు. అలాగే అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల్ని వాడాలని కూడా కోరారు.
తిరుపతి పరిణామాలపై ఈసీ సీరియస్
తిరుపతిలో ఉపఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా టీడీపీ ఎంపీలు చేసిన ఫిర్యాదులపై ఈసీ స్పందన చూస్తే ఈ విషయం అర్దమవుతోంది. తిరుపతి ఘటనలపై ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల అధికారి అయిన విజయానంద్కు ఈసీ నుంచి పలు సూచనలు అందాయి. అదే సమయంలో వీటిపై ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలకు కూడా ఈసీ తాము తీసుకున్న చర్యల్ని వివరిస్తూ సమాధానం పంపింది. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై దర్యాప్తుతో పాటు పలు కీలక చర్యల్ని ప్రకటించింది.
చంద్రబాబు రాళ్ల దాడి ఘటనపై ఈసీ దర్యాప్తు
టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబుపై తిరుపతిలో జరిగిన రాళ్ల దాడిపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు టీడీపీ నేతలకు పంపిన సమాధానంలో ఈసీ అధికారులు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక పోలీసు అధికారిని నియమిస్తామని కూడా తెలిపారు. ఇప్పటికే ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర పోలీసులు.. అసలు రాళ్ల దాడే జరగలేదని, ఆధారాలే లేవని చెప్తున్న నేపథ్యంలో ఈసీ దీనిపై ప్రత్యేక దర్యాప్తు చేయిస్తామని చెప్పడం వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మారింది.
తిరుపతిలో వాలంటీర్లకు చెక్
తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉన్న వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఈసీ.. రాష్ట్ర ఎన్నికల అధికారికి పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా ఆయన తదుపరి ఆదేశాలు ఇచ్చారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆయన ఆదేశాల్లో పేర్కొన్నారు. అలాగే అభ్యర్ది తరఫున ఏజెంట్లుగా కూడా ఉంచొద్దని ఆదేశించారు. ఇప్పటికే వాలంటీర్లు ప్రభుత్వం తరఫున ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు వచ్చిన నేఫథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర బలగాల పహారాలో ఉపఎన్నిక
తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా రాష్ట్రానికి చెందిన పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసే ప్రమాదం ఉందని టీడీపీ చేసిన మరో ఫిర్యాదుపైనా ఈసీ స్పందించింది. తిరుపతిలోని దాదాపు అన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాల పహారా ఉంటుందని స్పష్టం చేసింది. అత్యధిక శాతం కేంద్ర బలగాల పహారా కొనసాగుతుందని తెలిపింది. దీంతో ఉపఎన్నికలో స్ధానిక సంస్ధల ఎన్నికల తరహాలో వైసీపీ పోలీసుల్ని వాడుకునేందుకు అవకాశం ఉండదని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి.