ఒక్కసారిగా కుప్పకూలిన విద్యార్థినులు: కొత్తపల్లి పాఠశాలలో ఏం జరుగుతోంది?
కాకినాడ: జిల్లాలోని యు.కొత్తపల్లి ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక తరగతుల కోసం వెళ్లిన ఏడుగురు విద్యార్థులను స్పృహ కోల్పోయి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. వారు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో వెంటనే వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అయితే, ఇక్కడి విద్యార్థినులు ఉన్నట్టుండి కుప్పకూలడం ఇదే తొలిసారి కాకపోవడం గమనార్హం. 20 రోజుల క్రిందట ఓ బాలిక ఇలాగే కళ్లు తిరిగి పడిపోయింది. శనివారం రాత్రి కూడా పలువురు విద్యార్థినులు ఇలాగే అస్వస్థతకు గురయ్యారు.

అయితే, ఆదివారంనాడు ఒకేసారి ఏడుగురు విద్యార్థినులు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. విద్యార్థినులు ఈ విధంగా ఎందుకు అనారోగ్యానికి గురవుతున్నారనే మిస్టరీగా మారింది. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనలపై కాకినాడ జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా స్పందించారు. యు.కొత్తపల్లి హైస్కూల్ను పరిశీలించాలని పొల్యూషన్ విభాగం సిబ్బందిని ఆదేశించారు. ఆయుష్ కమిషనర్ రాములు కూడా తమ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. పాఠశాలకు వెళ్లిన ఆయుష్ సిబ్బంది అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
స్థానిక నేతలు, ప్రజల ఆందోళనలతో విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించేందుకు వారిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మ ఆస్పత్రికి వెళ్లి విద్యార్థులను పరిశీలించారు. కాగా, అక్టోబర్ 25, 26 తేదీల్లో పాఠశాలల్లో విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.












Click it and Unblock the Notifications