పదవులతో లాభంలేదు: రిజైన్వైపు ఎంపీలు, మనస్తాపం
న్యూఢిల్లీ: పదవుల వల్ల లాభం లేదని, సమైక్యాంధ్ర కోసం రాజీనామాలే దారి అని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఏడుగురు కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎంపీలు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివ రావు, ఉండవల్లి అరుణ్ కుమార్, ఎస్పీవై రెడ్డి, మాగుంట శ్రీనివాసులు, సాయి ప్రతాప్, అనంత వెంకట్రామి రెడ్డిలు రాజీనామాలకు సిద్ధపడుతున్నారని తెలుస్తోంది.
ఈ నెల 24వ తేదీన సభాపతి మీరాకుమార్ను కలిసి రాజీనామాలు ఆమోదింప చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వారు స్పీకర్ అపాయింటుమెంట్ కూడా కోరారు. తెలంగాణపై వెనక్కి తగ్గేది లేదని, ఆంటోని కమిటీ నోట్ వచ్చే వరకు మాత్రమే ఆగుతామని, హైదరాబాదు పైన ఏమైనా అభిప్రాయాలు ఉంటే చెప్పాలని శుక్రవారం సీమాంధ్ర నేతలతో ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ అన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

తగ్గేది లేదని అధిష్టానం పెద్దలు నిత్యం చెబుతుండటంతో ఇక పదవుల్లో ఉండి లాభం లేదని రాజీనామా చేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారట. తాము మొదటి నుండి సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నప్పటికీ సమైక్యవాదులు పదవులలో ఉండే అడుగు పెట్టనివ్వడం లేదని, పదవుల్లో ఉంటే ఇన్నాళ్లు అడ్డుకోవచ్చునని భావించామని, ముందుకే వెళ్తామని రోజు ప్రకటిస్తున్నందున పదవుల్లో ఉండి లాభం లేదని, రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారట. నిన్నటి డిగ్గీ వ్యాఖ్యలతో వారు మనస్తాపం చెందినట్లుగా తెలుస్తోంది.
సర్దిచెబుతున్న కేంద్రమంత్రులు
ఎంపీలు రాజీనామాకు సిద్ధపడటంతో కేంద్రమంత్రులు పలువురు వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారట. రాజీనామా చేస్తే సభలో సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశాన్ని వదులుకున్నట్లవుతుందని, మరికొన్నాళ్లు వేచి చూడాలని చెబుతున్నారట. ఎంపీలు రాజీనామా చేస్తే సీమాంధ్ర ఉద్యమకారుల నుండి కేంద్ర మంత్రులపై మరింత ఒత్తిడి పెరుగుతుంది.












Click it and Unblock the Notifications