ఫీజుల దందాపై పల్లె రఘునాథ్ రెడ్డికి ఎస్ఎఫ్ఐ హెచ్చరిక:సిఎం పర్యటన అడ్డుకుంటాం!
అనంతపురం:విద్యను వ్యాపారం చేస్తూ కరువు జిల్లా అనే కనికరం లేకుండా అనంతపురంలో ఫీజుల దందా చేస్తున్న టిడిపి నేత పల్లె రఘునాథ్ రెడ్డి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని మంగళవారం భారత విద్యార్థి ఫెడరేషన్ సమావేశం నిర్వహించింది.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా నేత ఈశ్వర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న పల్లె రఘునాథ్ రెడ్డి విద్యాసంస్థలలో ఫీజుల దందాని అరికట్టాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉందని ఇష్టానుసారంగా ఫీజుల దందా చేస్తున్న విద్యా సంస్థలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ తన విద్యా సంస్థల కోసమే పని చేస్తున్న ప్రభుత్వ చీఫ్ విప్ రఘునాథ్ రెడ్డిపై కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
లేని పక్షంలో ఆగస్టు 1న రాష్ట్ర ముఖ్యమంత్రి అనంతపురం జిల్లా పర్యటనను అడ్డుకుంటామని ఎస్ఎఫ్ఐ నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఈశ్వర్,మూర్తి , మనోహర్, నారాయణ స్వామి, బాలాజీ , చిన్న, బాబు పాల్గొన్నారు.