కేసీఆర్ ఆస్తులెలా పెరిగాయ్: షబ్బీర్, లోకేష్ ఏ హోదాలో: తలసాని
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుల ఆస్తులు తగ్గితే, కేసీఆర్, ఆయన కుటుంబం ఆస్తులు మాత్రం ఎలా పెరిగాయో చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మంగళవారం మండిపడ్డారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నీతులు చెప్పడమే తప్ప ఆచరించే వ్యక్తి కాదన్నారు.
నాగార్జునసాగర్ పర్యటనలో భాగంగా అక్కడ చెప్పిన నీతులు ఇబ్రహీంపట్నం వచ్చేసరికి మరచిపోయారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకోవడం అప్రజాస్వామికమన్నారు. ముఖ్యమంత్రికి నైతిక విలువలు తెరాసలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికల బరిలోకి దిగాలన్నారు.
2001లో రూ.85 లక్షల ఆస్తులు చూపిన కేసీఆర్, 2014లో రూ.15.10 కోట్ల ఆస్తులు ఎలా చూపించారో చెప్పాలన్నారు. ఉద్యమంలో ఉన్నవారు ఆస్తులు అమ్ముకుంటే ఉద్యమ నాయకుడి ఆస్తులు ఎలా పెరిగాయన్నారు. తెలంగాణ భవన్ నిర్మాణానికి, టీ న్యూస్ ఛానల్, నమస్తే తెలంగాణ పత్రికకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్నారు.
నారా లోకేష్ ఏ హోదాతో వెళ్లారు: తలసాని
నారా లోకేష్ అమెరికా పర్యటన పైన తలసాని శ్రీనివాస్ ప్రశ్నల వర్షం కురిపించారు. లోకేష్ ఏ హోదాతో అమెరికా వెళ్లారని ప్రశ్నించారు. లోకేష్ వెంట సీఎం ఓఎస్డీ కూడా ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. పనిపాట లేనివాళ్లే తెరాస శిక్షణా తరగతుల పైన విమర్శలు చేస్తున్నారన్నారు. ఏపీ ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి యోగా నిర్వహించలేదా అని ప్రశ్నించారు.
సనత్నగర్ ఉప ఎన్నిక ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉన్నానని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. చంద్రబాబు హయాం నుంచే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని అన్నారు
ఇకపోతే వాణిజ్య పన్నుల వసూలుకు కొత్తగా రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు తలసాని శ్రీనివాస్ తెలిపారు. కొనుగోలు దారులు బిల్లులు తీసుకోనందున ప్రభుత్వానికి పన్నులు రావడం లేదని, పారిశ్రామిక వేత్తలు, రియల్టర్లు, రాజకీయ నాయకులు ఖరీదైన వస్తువులు కొన్నా ఐటీ భయంతో బిల్లు తీసుకోవడం లేదన్నారు.
అధికారులకు దేవినేని హెచ్చరిక
అధికారులు పని తీరు మార్చుకోకపోతే వేటు తప్పదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు హెచ్చరించారు. కృష్ణా జిల్లా విజయవాడలో జలవనరుల సలహామండలి సమావేశంలో మంత్రి మాట్లాడారు.