నిరాధార వార్తలకు సిగ్గు పడాలి.. కియా తరలింపు వార్తలపై మండిపడ్డ రోజా
అనంతపురం జిల్లాలో ఉన్న కియా మోటార్స్ తరలిపోతుందని అంతర్జాతీయ మీడియా రాయిటర్స్ కథనం ప్రచురించటం ఏపీలో ప్రకంపనలు రేపింది . ఈ కథనాలపై ఏపీ సర్కార్ కూడా క్లారిటీ ఇచ్చింది. కియా మోటార్స్ తరలిపోతుంది అని రాయిటర్స్ ఇచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని, అసత్యాలతో కూడిన కథనమని పరిశ్రమలు,వాణిజ్యం,పెట్టుబడుల శాఖ స్పెషల్ సెక్రటరీ రజత్ భార్గవ చెప్పారు. కియా, ఏపీ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయని.. ఈ కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అని ఆయన పేర్కొన్నారు. ఇక వైసీపీ మంత్రులు, నేతలు కూడా కియా తరలింపు వార్తలను ఖండిస్తున్నారు.
ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ వార్తపై , అలాగే కియా తరలింపు ప్రచారంపై మండిపడ్డారు. మీడియాలో వస్తోన్న వార్తలు అసత్యమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కియా మోటార్స్ ప్రాజెక్టు గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోన్న రాయిటర్స్ ఇండియా సిగ్గుపడాలని ఆమె ఘాటుగా విమర్శించారు . వార్తల పేరుతో ఇటువంటి నిరాధార విషయాలను ప్రచారం చేస్తోన్న జర్నలిస్టులను చూసి షాక్ అవుతున్నాను అని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
ఇక ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్ ప్లాంటును తమిళనాడుకు తరలించే యోచనలో ఆ సంస్థ ఉందంటూ రాయిటర్స్ ప్రచురించిన కథనం విపక్షాలకు అధికార పక్షాన్ని విమర్శించే ఆయుధం అయ్యింది. రాష్ట్రం నుంచి కియా తరలిపోతోందంటే రాష్ట్ర భవిష్యత్తుపై చావు దెబ్బ కొట్టినట్లే అని టీడీపీ ఇప్పటికే విమర్శలు గుప్పిస్తుంది . ఇక అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలు టీడీపీ విమర్శలను , కియా తరలింపు వార్తలను తిప్పి కొట్టే యత్నం చేస్తున్నారు.