రెచ్చిపోయిన శంకరన్న: వైయస్, కిరణ్ ఫ్లెక్సీ చించివేత
మంగళవారం మధ్యాహ్నం శంకర రావు సిఎల్పీ కార్యాలయానికి వచ్చారు. మీడియా పాయింట్ వెనుక ఫ్లెక్సీలో ఉన్న వైయస్, కిరణ్ ఫోటోలను చించి వేశారు. ఒక్కసారిగా ఆయన ఫ్లెక్సీని చించి వేయడంతో అక్కడున్న వారు అవాక్కయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోనియా గాంధీ దిష్టిబొమ్మలు తగులబెట్టడం తగదని చెప్పారు.
కాగా, కిరణ్ కుమార్ రెడ్డి పైన శంకర రావు మంత్రిగా ఉన్న సమయంలో తీవ్ర ఆరోపణలు చేయడంతో ఆయనను బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. కిరణ్ పైన మొదటి నుండి శంకర రావు నిప్పులు చెరుగుతున్నారు.
ఢిల్లీకి గవర్నర్
రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీలో ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తదితరులతో భేటీ కానున్నారు.
హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, రక్షణ మంత్రి ఎకె ఆంటోనీలతో కూడా భేటీ కానున్నారు. గవర్నర్ నరసింహన్ శుక్రవారం వరకు ఢిల్లీలోనే ఉండే అవకాశముంది. రాష్ట్ర పరిస్థితుల పైన ఆయన కేంద్రానికి నివేదిక సమర్పిస్తారు.
డిగ్గీతో కెవిపి భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్తో రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్ర రావు భేటీ అయ్యారు.