తెలంగాణ బాధ్యతలకు షర్మిల నో: తెరమీదికి పొంగులేటి?
హైదరాబాద్: పార్టీ తెలంగాణ బాధ్యతలను చేపట్టడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల నిరాకరించినట్లు సమాచారం. తెలంగాణలో పార్టీ సరైన ఫలితాలు సాధించకపోవడం ఆమెను తీవ్ర నిరాశకు గురి చేసినట్లు భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలను, పార్లమెంటు సీటును పార్టీ గెలుచుకుంది.
ఆ సీట్లు కూడా సిపిఎం మద్దతు వల్లనే వచ్చాయనే అభిప్రాయం బలంగా ఉంది. పైగా, ఈ ముగ్గురు శాసనసభ్యులు కూడా తెలంగాణ రాష్ట్రం అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు ప్రకటించడం తెలంగాణ నేతలను అసంతృప్తికి గురి చేసినట్లు సమాచారం. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన తర్వాత పార్టీని నిర్మించడం కష్టమనే భావనతో వారున్నట్లు చెబుతున్నారు. షర్మిల నిరాకరించిన నేపథ్యంలో ఆ బాధ్యతలను ఖమ్మం పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డికి జగన్ అప్పగించినట్లు చెబుతున్నారు.
తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఖమ్మంలో విజయబావుటా ఎగరేసిన ఆయనకు సామాజిక వర్గం, ఆర్థిక వనరులు కలిసివచ్చాయని చెప్పొచ్చు. సోమవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించిన తర్వాత పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలంగాణ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అడ్హక్ కమిటీ కన్వీనర్గా పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

పార్టీ తెలంగాణ బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించాలని నిర్ణయించినట్టు సమాచారం. తెలంగాణలోనూ వైయస్సార్ కాంగ్రెసును బలోపేతం చేయాలని జగన్ ఈ సందర్భంగా పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు. ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో ఫ్లోర్లీడర్, డిప్యూటీ లీడర్, విప్ పదవులను ఇచ్చిన ఆయన పొంగులేటిని పార్లమెంటరీ పార్టీ కార్యదర్శిగా నియమించారు.
తెలంగాణలో పార్టీ బలోపేతానికి అదే సామాజిక వర్గానికి చెందిన పొంగులేటిని నియమిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. శ్రీనివాస్రెడ్డికి గ్రామస్థాయిలో కార్యకర్తలు లేకపోయినా వ్యూహాత్మకంగా విజయం దక్కించుకోవడంతో పార్టీలో ప్రాధాన్యం పెరిగింది. కీలక బాధ్యతలు అప్పగిస్తే పార్టీ బలపడుతుందని జగన్ ఆశించడం, తెలంగాణలో బలమైన నాయకుడు మరొకరు లేకపోవడం పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి కలిసి వచ్చింది.












Click it and Unblock the Notifications