ఆంధ్రప్రదేశ్ కొత్త సిఎంపై శశిథరూర్, అధిష్టానం డైలమా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలా లేక కొత్త ముఖ్యమంత్రిని నియమించాలా అన్న విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్రమంత్రి శశి థరూర్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రక్రియ చివరి దశలో ఉందని, ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాలు ఇద్దరు ముఖ్యమంత్రులు అన్న ఆలోచన సరికాదన్నారు. పొత్తులపై ప్రశ్నించగా ఆంటోని కమిటీ ఒక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లోనే కాక మొత్తం దేశంలో పొత్తుల అంశాన్ని పరిశీలిస్తుందని, త్వరలో స్పష్టత వస్తుందన్నారు.
కాగా, రాష్ట్ర ప్రభుత్వ పాలనా పగ్గాలు ఎవరికి చేతికి దక్కుతాయన్న అంశంపై ఇంకా స్పష్టత రావడం లేదు. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే. గవర్నర్ నుంచి కేంద్రానికి నివేదిక వెళ్లిందా.. అన్న అంశంపై ఉన్న సందిగ్ధం కూడా తొలగడం లేదు. గవర్నర్ నుండి రాష్ట్రపతి పాలన కోసం నివేదిక వెళ్లిందని గురువారం ఉదయం వార్తలు రాగా, ఆ తర్వాత వెళ్లలేదని తెలుస్తోంది.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనపై డోలాయమాన పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో కొంతమంది మంత్రులు నేరుగా రాష్ట్ర గవర్నర్తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరా రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, దానం నాగేందర్లు గవర్నర్ను కలిశారు. ఇందులో ముఖ్యమంత్రి పీఠాన్ని కోరుకుంటున్న వారు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుండడంతో ఇప్పుడు అదే అంశంపై గవర్నర్తో మాట్లాడి ఉంటారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల కొద్ది రోజులుగా ఢిల్లీలో మకాం వేసి అధిష్టానంతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లుగా కూడా కొంతమంది మంత్రుల పేర్లు వినిపించాయి. ఇప్పుడు గవర్నర్ను కలవడానికి ముందు కూడా బొత్స ఇంట్లో నలుగురు మంత్రులు భేటీ కావడం, ఆ తరువాతే గవర్నర్ను కలిసేందుకు రాజ్భవన్కు వెళ్లడంతో ఈ కలయికపై చర్చ ఎక్కువగా సాగుతోంది.
మరోవైపు రాష్ట్రపతి పాలన విధించాలా, లేక ఎన్నికలను ఆరు నెలలు వాయిదా వేసి కొత్త నేతకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించాలా.. అన్న అంశంపై అధిష్టానం కూడా నిర్ధిష్ట నిర్ణయం తీసుకోలేకపోతోంది. శుక్రవారం కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.