తల్లికి వందనంలో ట్విస్ట్..! డ్వాక్రా మహిళలకు బ్యాంకుల షాక్?
ఏపీలో తల్లికి వందనం (talliki Vandanam) పథకం కింద ఈ ఏడాది 60 లక్షలకు పైగా విద్యార్ధుల తల్లులకు ప్రభుత్వం 10 వేల కోట్లకు పైగా మొత్తాల్ని తాజాగా విడుదల చేసింది. ఈ నిధుల్ని రెండు రోజుల క్రితం విడుదల చేయగా.. ఇవాళ్టి వరకూ బ్యాంకుల్లో పడతాయని విద్యామంత్రి నారా లోకేష్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. అయితే ఇప్పటివరకూ ఈ నిధులు జమ కాలేదని పలు చోట్ల ఫిర్యాదులు వస్తున్నాయి. వీరిలో ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఉన్నారు. అయితే వీరికి నిధులు జమ కాకపోవడం వెనుక ఓ కారణం ఉంది.
తల్లికి వందనం పథకం కింద విద్యార్దుల తల్లుల ఖాతాల్లో గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు నిధులు జమ చేస్తున్నాయి. అయితే ఇలా జమ చేస్తున్న నిధులు ప్రభుత్వం విడుదల చేయగానే తమ ఖాతాల్లా పడాలంటే సదరు మహిళల బ్యాంక్ ఖాతాలు క్లియర్ గా ఉండాలని అధికారులు సూచిస్తూనే ఉన్నారు. అయినా కేవైసీ కాకపోవడం, బ్యాంకులకు డిఫాల్ట్ గా ఉండటం (రుణాలు, ఇతర బకాయిలు చెల్లించకపోవడం) వంటి కారణాలతో వారికి ఈ నిధులు పడినా వాటిని తీసుకోలేని పరిస్ధితి ఏర్పడుతోంది.

ఈసారి కూడా "తల్లికి వందనం" పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిన నగదు విత్ డ్రాపై కొన్ని బ్యాంకులు ఆంక్షలు విధిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డ్వాక్రా (స్వయం సహాయక సంఘాల) సభ్యులుగా ఉన్న మహిళల ఖాతాలను హోల్డ్లో ఉంచడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పిల్లల విద్య కోసం అందిస్తున్న ఈ ఆర్థిక సాయాన్ని వెంటనే వినియోగించుకోవాల్సిన సమయంలో, బ్యాంకులు తమ ఖాతాల్లోని నగదును నిలిపివేయడంతో అవసరాలకు డబ్బు తీసుకోలేకపోతున్నామని మహిళలు వాపోతున్నారు. ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేసిన నగదును కొన్ని బ్యాంకులు రుణ బకాయిల పేరుతో హోల్డ్ చేయడం వల్ల ఈ పరిస్ధితి ఎదురవుతోంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని తల్లికి వందనం నగదును తమకు ఇప్పించాలని లబ్దిదారులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications