అంతా అవినీతి: బాబుపై మరోసారి శిల్పా తీవ్రవ్యాఖ్యలు, అఖిల ఘాటు కౌంటర్
మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో.. ఆయనకు మంత్రి అఖిలప్రియ, టిడిపి నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
నంద్యాల: మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో.. ఆయనకు మంత్రి అఖిలప్రియ, టిడిపి నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. శిల్పా వైసిపి చీఫ్ జగన్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
చదవండి: శిల్పాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అఖిలప్రియ
ఈ నేపథ్యంలో మంత్రులు కాల్వ శ్రీనివాసులు, అఖిలప్రియ తదితరులు నంద్యాలలో టిడిపి నాయకులతో, కార్యకర్తలతో భేటీ అయ్యారు. శిల్పాతో పాటు కేడర్ పార్టీ మారకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో శిల్పా-అఖిల మధ్య వాగ్యుద్ధం జరిగింది.
ప్రభుత్వంపై శిల్పా తీవ్ర విమర్శలు.. బాబును నేరుగా టార్గెట్
తాను పార్టీ అధిష్టానం వల్లే తెలుగుదేశం పార్టీని వీడుతున్నానని శిల్పా మోహన్ రెడ్డి చెప్పారు. భూమా కుటుంబం నుంచి వచ్చిన సమస్యలను తాను అధినేతకు వివరించినా సరిగా స్పందించలేదని ఆరోపించారు. టిడిపి హయాంలో అభివృద్ధి అంతంతే అని విమర్శలు చేశారు. అనవసరంగా ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని మండిపడ్డారు.
చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అవినీతి చాలా ఎక్కువ అయిందని శిల్పా మోహన్ రెడ్డి షాకింగా కామెంట్లు చేశారు. ఈ ప్రభుత్వంలో అవినీతి పెరిగిందని తాను పార్టీ సమావేశాల్లోను చాలాసార్లు చెప్పానని అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తే గెలుపు తనదేనని స్పష్టం చేశారు. అధికార పార్టీ నుంచి ఎదురయ్యే సమస్యలకు తాను భయపడే ప్రసక్తి లేదని చెప్పారు. వైసిపి అధినేత జగన్ తనకు టిక్కెట్ ఇస్తాడని విశ్వసిస్తున్నానని చెప్పారు.
అఖిలప్రియ కౌంటర్
శిల్పా మోహన్ రెడ్డి ఆరోపణలపై అఖిలప్రియ కూడా ధీటుగా స్పందించారు. అసలు తాను చేసిన అభివృద్ధి పనులు ఓర్వలేక ఆయన వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారని, అధికారులను బెదిరించారని, ఇప్పుడు వైసిపిలో చేరుతున్నారని మండిపడ్డారు. శిల్ప వెళ్లిపోతే నంద్యాలలో అందరికీ మంచిదని అభిప్రాయపడ్డారు. నియోజకర్గంలో అభివృద్ధిని అడ్డుకుంటూ ఇబ్బంది పెట్టామని చెప్పడం విడ్డూరమన్నారు.
టిడిపి నేతలు కూడా...
శిల్పా మోహన్ రెడ్డి వెళ్లిపోవడం వల్ల తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని టిడిపి నేతలు కూడా చెప్పారు. ఆయన కేవలం మూడేళ్ల క్రితం టిడిపిలోకి వచ్చారని, కానీ దశాబ్దాలుగా పలువురు నేతలు టిడిపికి అండగా ఉన్నారని, కాబట్టి తమకు నష్టం లేదని తేల్చి చెప్పారు. వైసిపిలోకి వెళ్తే శిల్పానే రాజకీయంగా నష్టపోతారని టిడిపి నేతలు హెచ్చరించారు.