హీరో శివాజీ 'ప్రత్యేక' మంట: పవన్ మద్దతుకు విజ్ఞప్తి
హైదరాబాద్: తెలుగు సినీ హీరో శివాజీ ప్రత్యేక హోదా మంట పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ 3వ తేదీన గుంటూరు హిందూ కాలేజీ ప్రాంగణంలో నిరాహార దీక్ష చేయనున్నారు. ఆ విషయాన్ని శివాజీ శుక్రవారం మీడియా సమావేశంలో చెప్పారు.
తన దీక్షకు అందరూ మద్దతు పలకాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో మీడియా కీలక పాత్ర పోషించిందని, ఏపికి ప్రత్యేక హోదా విషయంలోనూ మీడియా సహకరించాలని అన్నారు. పవన్కళ్యాణ్ వంటి నాయకులు, చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలు పెద్ద మనసుతో తన ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. తనకు చివరి శ్వాస ఉన్నంత వరకూ ఎపికి ప్రత్యేక హోదా కోసం పోరాడతానని స్పష్టం చేశారు.
రాజకీయ నాయకులంతా కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని , రాజకీయం అంటే ఒక సహాయం మాత్రమే కానీ సంపాదన కాదని అన్నారు. సంపాదన రాజకీయాలు చేయాలనే ఉద్ధేశ్యం తనకు లేదని చెప్పారు. ఊరికి ఒక్క మనిషి తనతో వస్తే చాలని, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామని ఆవేశంగా అన్నారు. ఇంత వరకూ తన పోరాటానికి మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికీ శివాజీ కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరులో నిరాహార దీక్ష చేసి తీరుతానని చెప్పారు.
ప్రత్యేక హోదా లభించిన అనంతరం తాను సాధారణ కార్యకర్తగానే మిగిలిపోతానని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై పోరాటానికి జనసేన అధినేత పవన్కళ్యాణ్ ముందుకు రావాలని కోరారు. అందరూ కలిసి ముందుకు వస్తే ప్రత్యేక హోదా సాధించి తీరుతామని శివాజీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా సాధించాలంటే ఒక్కరితో అయ్యే పనికాదని, అందరూ కలిసి రావల్సిందేనని వ్యాఖ్యానించారు.