సోనియాను ఎదిరించింది జగన్ ఒక్కడే: శోభా నాగిరెడ్డి
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను రాజకీయంగా ఎదుర్కునే సత్తా లేకనే కాంగ్రెసు పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో సమైక్య శంఖారావం సభలో ఆమె శనివారం మాట్లాడారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ విభజన నిర్ణయం తీసుకున్నారని, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది జగన్ ఒక్కడేనని ఆమె అన్నారు.
సోనియా గాంధీతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేతులు కలిపి విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారని ఆమె విమర్శించారు. ప్రజలంతా జగన్తో ఉన్నారని ఆమె చెప్పారు. జగన్ ఆలోచనల నిండా ప్రజలే ఉన్నారని ఆమె చెప్పారు. తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తే తమ పార్టీ ఎదుర్కుంటుందని ఆమె చెప్పారు.

రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు తమ పార్టీ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని శోభా నాగిరెడ్డి చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకుని పోవడంలో పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ఆమె చెప్పారు. జగన్ నాయకత్వంలో సమైక్య ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆమె చెప్పారు.
రాష్ట్ర విభజనలో సంప్రదాయాలు తుంగలో తొక్కారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు దాడి వీరభద్ర రావు అన్నారు. రాష్ట్ర విభజనకు సోనియా గాంధీతో పాటు చంద్రబాబు నాయుడు ఉత్సాహపడుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications