కేబినెట్లోకి 'వైసిపి' ఎమ్మెల్యేలు: చంద్రబాబు ఓకే చెప్పారు కానీ, నెత్తిన పిడుగు!
విజయవాడ: గత సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన పలువురు ఎమ్మెల్యేల ఆశలు అడియాసలవుతాయా? లేక టిడిపిలో చేరినందుకు ప్రతిఫలం దక్కుతుందా? అనే చర్చ సాగుతోంది.
పలువురు వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. ఇరవై మంది వరకు టిడిపిలో చేరారు. వారికి కొందరికి త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణలో మంత్రి పదవులు వస్తాయని కూడా చెబుతున్నారు. భూమా నాగిరెడ్డి, జలీల్ ఖాన్ వంటి ఇద్దరు ముగ్గురుకు చంద్రబాబు కేబినెట్లో చోటు దక్కవచ్చు.
పలువురు నేతలు మంత్రి పదవుల హామీలతోనే తెలుగుదేశం పార్టీలో చేరారనే వాదనలు ఉన్నాయి. ముఖ్యమంగా భూమా, జలీల్ ఖాన్ వాళ్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తోంది. త్వరలో వారిని చంద్రబాబు తన కేబినెట్లోకి తీసుకుంటారనే వార్తల నేపథ్యంలో.. తాజాగా సోమవారం నాడు హైకోర్టు నోటీసులు వారికి పిడుగుపడినట్లుగా అయిందని చెప్పవచ్చు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు హైకోర్టు మంగళవారం నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. వైసిపి నుంచి గెలిచి టిడిపిలో చేరిన వారంతా కోర్టుకు వివరణ ఇవ్వవలసి ఉంది.
నాలుగు వారాల తర్వాత హైకోర్టు ఏం చెబుతుందోననే టెన్షన్ టిడిపిలో చేరిన వారిలో ఉందని అంటున్నారు. పలువురి నేతల పేర్లను చంద్రబాబు కూడా ఓకే చేశారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కోర్టు నోటీసులు షాకిచ్చాయని అంటున్నారు.
పార్టీ మారిన వారిని అనర్హులుగా ప్రకటించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు హైకోర్టులో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తొలుత స్పీకర్కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. దీంతో ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి పిటిషన్ దాఖలు చేసారు. దీనిపై హైకోర్టు వారికి నోటీసులు జారీ చేసింది.