టీడీపీకి షాక్.. విశాఖ తెలుగు మహిళా అధ్యక్షురాలిపై కేసు నమోదు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు పైన విశాఖ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి పై గాజువాక పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.
విశాఖ తెలుగు మహిళా అధ్యక్షురాలు చేసిన పని
ఈ కేసుకు సంబంధించి గాజువాక సీఐ పార్థసారథి చెప్పిన వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్లోనే సర్వసిద్ధి అనంతలక్ష్మి ఒక వ్యక్తిని చెప్పుతో కొట్టిందని, తనను ఆపడానికి ప్రయత్నించిన సీఐ ని ట్రాన్స్ఫర్ చేయిస్తానని బెదిరించిందని తెలిపారు. విశాఖ నగరంలోని అక్కిరెడ్డిపాలెం కి చెందిన కొత్తూరు నరేంద్ర అనే వ్యక్తి ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు.

పోలీస్ స్టేషన్ లో వ్యక్తిని చెప్పుతో కొట్టిన టీడీపీ నాయకురాలు
ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని తన వద్ద నుండి 40 లక్షల రూపాయలు తీసుకున్నాడని, తమను మోసం చేశాడని, మార్చి రెండవ తేదీన గాజువాక పోలీసులకు విశాఖ తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి ఫిర్యాదు చేశారు. దీంతో నరేంద్ర ను పిలిపించి పోలీసులు విచారిస్తున్న క్రమంలో అనంతలక్ష్మి అక్కడికి చేరుకొని ఆగ్రహంతో ఊగిపోయారు. తన కాలికున్న చెప్పు తీసి నరేంద్రను పోలీస్ స్టేషన్లోనే కొట్టారు.
విశాఖ సీపీ దగ్గరకు బాధితుడు
40లక్షల రూపాయలు తీసుకున్నాడన్న అభియోగం పైన అనంతలక్ష్మి చేసిన ఫిర్యాదుతో గాజువాక పోలీసులు నరేంద్ర పైన కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నరేంద్ర ప్రస్తుతం బెయిల్ పై విడుదలయ్యాడు. అయితే తాను గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నానని, తనను పోలీస్ స్టేషన్లో అందరిముందు చెవిలో రక్తం కారే విధంగా అనంతలక్ష్మి చెప్పుతో కొట్టారని బాధితుడు నరేంద్ర ఇటీవల విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖభత్ర బాగ్చీ దృష్టికి తీసుకువెళ్లారు.
సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు
తనను కొట్టిన సదరు టిడిపి మహిళా నాయకురాలి పై కేసు పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో సిపి ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించి దాని ఆధారంగా ఆదివారం తెలుగు మహిళ అక్షరాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి పైన పోలీసులు కేసు నమోదు చేశారు.
సిఐని బెదిరించిన తెలుగు మహిళా అధ్యక్షురాలు
ఇలా పోలీస్ స్టేషన్లో కొట్టడం తప్పని సీఐ పార్థసారథి చెబుతుంటే, నా సంగతి మీకు తెలియదు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయిస్తాను అంటూ సిఐ ని కూడా బెదిరించి నట్టుగా పోలీస్ స్టేషన్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక టిడిపి మహిళా నాయకురాలు తనని బెదిరించింది వాస్తవమేనని సీఐ కూడా వెల్లడించారు. పోలీస్ స్టేషన్లో దాడి చేసి కొట్టినందుకు ఆమెపైన కేసు నమోదు చేసినట్టుగా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications