హరికృష్ణకు షాక్: రాజీనామాలు చేయని ముగ్గురు
సమైక్యాంధ్ర కోసం కొరడాలతో కొట్టుకున్న శివప్రసాద్ సహా ముగ్గురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అసలు రాజీనామానే చేయలేదనే విషయంపై వేడిగా చర్చ జరుగుతోంది. లోకసభలో వారు ఆందోళనకు కూడా దిగారు. లోక్సభ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించారంటూ స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన జాబితాలో టిడిపికి చెందిన నారాయణరావు పేరు తప్ప, మిగతా ముగ్గురి పేర్లు లేకపోవడం కొత్త అనుమానాలకు తెరలేపుతోంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ లోక్సభ సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నట్టు తెలుగుదేశానికి చెందిన నలుగురు సీమాంధ్ర ఎంపీలు ప్రకటించటం తెలిసిందే. అనంతర పరిణామాల్లో రాజీనామా లేఖలను స్పీకర్ మీరాకుమార్కు ఇచ్చేసినట్టు నారాయణరావు, వేణుగోపాల్ రెడ్డి, కిష్టప్ప, శివప్రసాద్లు ప్రకటించారు కూడా. అయితే స్పీకర్ కార్యాలయం వెల్లడించిన జాబితా ప్రకారం తెలుగుదేశానికి చెందిన నారాయణరావు రాజీనామా లేఖ మాత్రమే మీరాకుమార్ పరిశీలనలో ఉంది.
దీన్నిబట్టి మిగతా ముగ్గురు టిడిపి ఎంపీలు శివప్రసాద్, కిష్టప్ప, వేణుగోపాల్ రెడ్డి తమ సభ్యత్వాలకు రాజీనామా చేయనట్టేనని అంటున్నారు. అయితే, వీళ్లంతా స్పీకర్ పోడియం వద్ద పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తే, ఎంపీ శివప్రసాద్ ఒకడుగు ముందేకేసి విచిత్ర వేషాలు, విన్యాసాలతో సభలో అలజడి సృష్టించారు.