నూజివీడు వైసీపీలో ముసలం... ఆరుగురు కౌన్సిలర్ల రాజీనామా!
అమరావతి: నూజివీడు వైసీపీలో ముసలం మొదలైంది. ఇక్కడి మున్సిపాలిటీలో విభేదాలు తారస్థాయికి చేరడంతో అధికార వైసీపీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు తమ పదవికి రాజీనామా చేశారు.
నూజివీడు మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ఉన్నాయి. వీటిలో 22 స్థానాలు వైసీపీ కైవసం చేసుకోగా, 8 టీడీపీ గెలుచుకుంది. దీంతో పాలనా పగ్గాలు వైసీపీ చేపట్టింది. అయితే అప్పటికే ఛైర్పర్సన్ పదవి కోసం పోటీ మొదలైంది.
ఛైర్పర్సన్ పదవి కోసం పోటీ...
నూజివీడు మున్సిపాలిటీ వైసీపీలో రెండు వర్గాలున్నాయి. ఒక వర్గం బసవా రేవతిది కాగా, మరో వర్గం రామిశెట్టి త్రివేణిది. ఈ రెండు వర్గాలు మున్సిపల్ ఛైర్పర్సన్ పదవి మాకంటే మాకు అంటూ పోటీ పడ్డాయి.
రెండు వర్గాలకు.. చెరో రెండున్నర సంవత్సరాలు...
నూజివీడు మున్సిపల్ ఛైర్పర్సన్ పదవి కోసం బసవా రేవతి, రామిశెట్టి త్రివేణి వర్గాలు రెండూ పోటీ పడడంతో వైసీపీ ఎమ్మెల్యే వెంకట ప్రతాప్ అప్పారావు రంగంలోకి దిగారు. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చారు. ఇద్దరూ చెరో రెండున్నర సంవత్సరాలు పదవి పంచుకోమని సూచించారు.
తొలి అవకాశం.. రేవతికి...
ఒప్పందం ప్రకారం.. మొదట అవకాశం బసవా రేవతికి వచ్చింది. దీంతో ఆమె నూజివీడు మున్సిపాలిటీ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టారు. అలా రెండున్నర సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు మున్సిపాలిటీ పాలక పగ్గాలు రామిశెట్టి త్రివేణికి అప్పగించాల్సి ఉంది.
మనస్థాపానికి గురైన త్రివేణి వర్గం...
రెండున్నరేళ్లు గడిచినా మున్సిపాలిటీ పాలనా పగ్గాలు రామిశెట్టి త్రివేణి వర్గానికి అప్పగించకపోవడంతో అసలు కథ మొదలైంది. రేవతి వర్గం ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో త్రివేణి వర్గం తీవ్ర మనస్థాపానికి గురైంది. ఫలితంగా ఆ వర్గానికి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు పదవులకు రాజీనామా చేశారు. దీంతో వైసీపీ ముఖ్యనాయకులు రంగంలోకి దిగారు. సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.