టీడీపీ, కాంగ్రెస్లకు షాక్: తలసాని సహా 7గురు ఎమ్మెల్యేలకు హైకోర్టు ఓకే
హైదరాబాద్: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుండి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో గురువారం నాడు ఊరట లభించింది. తద్వారా తెరాసలో చేరిన ఎమ్మెల్యేలు జూన్ 1వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు సానుకూలత ఏర్పడింది.
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణా రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కాలె యాదయ్య, రెడ్యా నాయక్, విఠల్ రెడ్డి, కనకయ్యలు కొద్ది రోజుల క్రితం తెరాస పార్టీలో చేరారు.
వారు గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల తరఫున పోటీ చేసి గెలుపొందారు. అనంతరం తెరాసలో చేరారు. మూడు రోజుల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో తమ పార్టీల నుండి తెరాసలో చేరిన ఎమ్మెల్యేలు ఓటు వేయకుండా ఆదేశాలు జారీ చేయాలని టీడీపీ నుండి ఎర్రబెల్లి దయాకర రావు, కాంగ్రెస్ పార్టీ తరఫున సంపత్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఎర్రబెల్లి, సంపత్ కుమార్లకు హైకోర్టులో చుక్కెదురైంది.
గురువారం నాడు ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం వారు ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని తెలిపింది. ఎమ్మెల్యేల అనర్హత వేటు పైన ఇంకా సభాపతి నిర్ణయం తీసుకోలేదని, అదే సమయంలో ఈ పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేదమని, వారు ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని కోర్టు తెలిపింది.