విజయ్ వార్నింగ్: "అది మా ప్రజల త్యాగం.. అమ్మేస్తామంటే ఒప్పుకోం!"
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై తమిళనాడు నయా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తొలిసారిగా తన గళాన్ని గట్టిగా వినిపించారు. ప్రతిష్టాత్మక నెయ్వేలి లిగ్నైట్ కార్పొరేషన్ (NLC) ఇండియా లిమిటెడ్లో వాటాల ఉపసంహరణకు (Disinvestment) కేంద్రం సిద్ధమవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నేరుగా లేఖ రాస్తూ తన నిరసనను వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నవరత్న సంస్థ 'నెయ్వేలి లిగ్నైట్ కార్పొరేషన్' (NLC) లో తనకున్న ఈక్విటీ వాటాలను విక్రయించాలనే కేంద్ర నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. 'ఆఫర్ ఫర్ సేల్' (OFS) పద్ధతిలో ఎన్ఎల్సీకి చెందిన 2 శాతం ప్రాథమిక వాటాలతో పాటు, అదనంగా 1 శాతం గ్రీన్-షూ ఆప్షన్తో కలిపి మొత్తం 3 శాతం పెయిడ్-అప్ ఈక్విటీని విక్రయించడానికి కేంద్రం సిద్ధమైంది. ఈ నిర్ణయాన్ని పూర్తిగా పునరాలోచించుకోవాలని ముఖ్యమంత్రి విజయ్ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు.

అది కేవలం కంపెనీ కాదు.. 'జాతీయ వ్యూహాత్మక ఆస్తి'!
ప్రధాని మోదీకి రాసిన అధికారిక లేఖలో ముఖ్యమంత్రి విజయ్ పలు కీలకమైన అంశాలను ప్రస్తావించారు. ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ను కేవలం స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఒక సాధారణ కంపెనీగా చూడలేమని ఆయన స్పష్టం చేశారు.
"తమిళనాడు ప్రభుత్వం ఎన్ఎల్సీని దేశ ఇంధన భద్రత, ఖనిజాభివృద్ధి, కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగస్వామిగా ఉన్న ఒక 'వ్యూహాత్మక జాతీయ ఆస్తి' (Strategic National Asset) గా భావిస్తుంది. ఇటువంటి కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థలో కేంద్ర ప్రభుత్వం తన వాటాలను ఏమాత్రం తగ్గించుకున్నా, అది భవిష్యత్తులో ప్రభుత్వ యాజమాన్య హక్కులపై ఒక తప్పుడు సాంప్రదాయానికి దారితీస్తుంది" అని సీఎం విజయ్ లేఖలో హెచ్చరించారు.
తమిళనాడు ప్రజల త్యాగాల పునాది!
ఎన్ఎల్సీ సంస్థ తమిళనాడులోని నెయ్వేలి ప్రధాన కేంద్రంగా దశాబ్దాలుగా సేవలందిస్తోందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఈ సంస్థ స్థాపన, విస్తరణ వెనుక తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా సహకారం, అంతకంటే ముఖ్యంగా ఇక్కడి ప్రజలు తమ భూములను త్యాగం చేసి ఇచ్చిన మద్దతు దాగి ఉందని లేఖలో పేర్కొన్నారు. ఈ అంశం కేవలం ఆర్థిక లాభనష్టాలకు లేదా నిధుల సేకరణకు సంబంధించినది కాదని, ఇది నేరుగా తమిళనాడు రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలతో పాటు దేశ ఇంధన భద్రతతో ముడిపడి ఉన్న సెంటిమెంట్ అని విజయ్ స్పష్టం చేశారు.
కేంద్రం పునరాలోచించుకోవాలి.. తమిళనాడు డిమాండ్!
ఏదైనా ఒక రాష్ట్ర మద్దతుతో, అక్కడి ప్రజల భూములతో ఎదిగిన ప్రభుత్వ రంగ సంస్థలు ఎప్పుడూ ప్రభుత్వ నియంత్రణ, పూర్తి యాజమాన్యం కిందే ఉండాలని తమిళనాడు ప్రభుత్వం బలంగా నమ్ముతోందని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ వాటాల ఉపసంహరణ నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థల ఉనికిని దెబ్బతీసేలా ఉందన్న ఆందోళనను వ్యక్తపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన ఈ నైతిక, వ్యూహాత్మక అభ్యంతరాలను గౌరవించి.. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రైవేటీకరణ, వాటాల విక్రయ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుంటారని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన లేఖను ముగించారు.














Click it and Unblock the Notifications