తొమ్మిదో తరగతి పిల్లలకు SIR.. NCERT కొత్త సిలబస్
దేశంలో ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా రూపకల్పనపై ప్రతిష్టాత్మక విద్యా సంస్థ 'ఎన్సీఈఆర్టీ' (NCERT) కీలక నిర్ణయం తీసుకుంది. 9వ తరగతి సోషల్ సైన్స్ (సాంఘిక శాస్త్రం) పాఠ్యపుస్తకంలో సరికొత్తగా 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) విధానాన్ని చేర్చింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే కాకుండా, దొంగ ఓట్లను ఏరిపారేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) తీసుకొచ్చిన ఈ సరికొత్త ఆయుధం ఇప్పుడు విద్యార్థుల పాఠ్యాంశంగా మారింది.
కొత్త జాతీయ విద్యా విధానం (NCF) మార్గదర్శకాలకు అనుగుణంగా మార్చిన 9వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకం "అండర్స్టాండింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్" లో దీనికి చోటు కల్పించారు. ఫేక్ న్యూస్, తప్పుడు ప్రచారం, బెదిరింపులు వంటి ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ.. కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహిస్తోందని ఈ కొత్త పాఠంలో ప్రశంసించారు.

ఏమిటీ 'SIR' విధానం? పుస్తకంలో ఏముంది?
గతంలో ఐదేళ్లకు ఒకసారి మాత్రమే ఓటర్ల జాబితాను పూర్తిగా సవరించేవారని పాత పుస్తకాల్లో ఉండేది. కానీ, మారిన సిలబస్ ప్రకారం.. ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) గురించి వివరించారు.
- ఓటర్ల జాబితాను నిరంతరం అప్డేట్ చేయడం, ధృవీకరించడం, తప్పులను సరిదిద్దడం ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం.
- దీని ద్వారా అర్హులైన ఏ ఒక్క పౌరుడూ ఓటు హక్కు కోల్పోకుండా, అలాగే అర్హత లేని వ్యక్తుల పేర్లు జాబితాలో ఉండకుండా ఈసీ చూస్తుందని పుస్తకంలో పేర్కొన్నారు.
- ముఖ్యంగా 18 ఏళ్లు నిండి, అవగాహన లేకపోవడం వల్ల ఓటు నమోదు చేసుకోని యువ ఓటర్లను ఇందులో చేర్చుతారు.
అలాగే మరణించిన వారి పేర్లు, ఇళ్లు మారి వెళ్ళిపోయిన వారు, ఒకే పేరుతో రెండు చోట్ల ఉన్న (డూప్లికేట్) ఓట్లను, శాశ్వతంగా అడ్రస్ లేని వారి పేర్లను ఈ ప్రక్రియ ద్వారా తొలగిస్తారు. తుది జాబితా ఇచ్చే ముందే అభ్యంతరాలను స్వీకరించి ఈసీ పరిష్కరిస్తుందని వివరించారు.
బీహార్ పైలట్ ప్రాజెక్ట్.. ఆరు కోట్ల ఓట్ల తొలగింపుతో రాజకీయం!
ఈ 'SIR' విధానం వెనుక పెద్ద రాజకీయ వివాదమే నడిచింది. గత ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జూన్ 24న ఎన్నికల సంఘం దీనిని పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించింది. ఈ ప్రక్రియ వల్ల కేవలం బీహార్లోనే ఏకంగా 65 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. ప్రస్తుతం ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించారు. దీనివల్ల దేశవ్యాప్తంగా దాదాపు 6 కోట్ల మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి గాల్లో కలిసిపోయాయి.
అయితే, దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. డాక్యుమెంట్ల నెపంతో ఉద్దేశపూర్వకంగానే ఓటర్లను తొలగిస్తున్నారని, ఎన్నికల సంఘం బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తోందని ఆరోపించాయి. ఈ వివాదం నడుస్తున్న తరుణంలోనే ఎన్సీఈఆర్టీ దీనిని పాఠ్యాంశంగా మార్చడం గమనార్హం.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల తంతు!
భారతదేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియ ప్రపంచంలోనే అత్యంత విలక్షణమైనదని, ఎక్కడా లేని విధంగా దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సవరించిన అధ్యాయంలో స్పష్టం చేశారు. విభిన్న భౌగోళిక ప్రాంతాలు, సామాజిక-ఆర్థిక పరిస్థితులు, వేలాది పోలింగ్ కేంద్రాలు, వందలాది రాజకీయ పార్టీలు ఉన్న భారతదేశం లాంటి పెద్ద దేశంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడం అత్యంత సవాలుతో కూడుకున్న పని అని, అయినప్పటికీ స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం ఈ బృహత్ కార్యాన్ని విజయవంతంగా నిర్వహిస్తోందని ఎన్సీఈఆర్టీ కొత్త పాఠ్యపుస్తకంలో కొనియాడింది.














Click it and Unblock the Notifications