సీసీటీవీకి ముసుగు- బాత్ రూమ్ లో డబ్బులు- అయోధ్య చోరీపై సిట్ షాకింగ్ రిపోర్ట్..!
అయోధ్య రామాలయం (ayodhya ram mandir) లో భక్తులు సమర్పించిన కానుకల చోరీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆలయ హుండీల నుంచి కోట్ల రూపాయల నగదును సిబ్బంది పక్కదారి పట్టించినట్లు ప్రత్యేక విచారణ బృందం (SIT) మధ్యంతర నివేదికలో వెల్లడైంది. ఈ తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా తమ తమ పదవులకు రాజీనామా చేశారు.
చోరీ ఎలా గుర్తించారు ?
బ్యాంకులలో డిపాజిట్ అవుతున్న ఆలయ నిధుల్లో తేడాలు రావడంతో ట్రస్ట్ సభ్యులకు అనుమానం వచ్చింది. సాధారణంగా ఒక్కో హుండీలో రూ. 6 నుంచి 7 లక్షల వరకు నగదు ఉండాలి. అయితే, రూ. 500 నోట్ల కట్టల్లో పెద్ద ఎత్తున కొరతను లెక్కింపు సమయంలో గుర్తించారు. దీనిపై నిఘా ఉంచేందుకు లెక్కింపు గదిలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేయడంతో అసలు దొంగల ముఠా గుట్టు రట్టయింది.

లెక్కింపు గదిలో మాయాజాలం..
సిబ్బంది లెక్కింపు ప్రక్రియలో సీసీటీవీల కంటికి చిక్కకుండా అత్యంత తెలివిగా ప్రణాళిక వేశారు. ఒక ఉద్యోగి సీసీటీవీ కెమెరాకు అడ్డంగా నిలబడి దాన్ని కప్పివేస్తే, అదే సమయంలో మరొకరు నోట్ల కట్టల నుంచి నగదును దొంగిలించి బట్టల్లో దాచుకునేవారు. లెక్కింపు పూర్తయ్యాక దొంగిలించిన ఈ కరెన్సీ సొమ్మును ఆలయ కాంప్లెక్స్ లోని బాత్రూమ్లలో దాచి, అనుకూల సమయం చూసి బయటకు తరలించేవారు.
లూటీ ఇలా చేశారు
నగదును బ్యాంకుకు తరలించే తరుణంలో దానికి అదనపు నోట్లు కలిపి వోచర్లను తారుమారు చేసే మోసానికి కూడా వీరు పాల్పడ్డారు. ఈ వ్యవహారం 2024 లో ఆలయం ప్రారంభమైనప్పటి నుంచే నిరంతరాయంగా జరుగుతున్నట్లు ఎస్ఐటీ గుర్తించింది. కేవలం ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 మధ్య కాలంలోనే దాదాపు 70 సార్లు దొంగతనాలు జరిగాయని సీసీటీవీ ఆధారంగా నిర్ధారించారు. భక్తులు సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలను కూడా వీరు తస్కరించారు.

ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మంది లెక్కింపు సిబ్బందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. చంపత్ రాయ్ మాజీ డ్రైవర్ టిన్ను యాదవ్, సుభాష్ శ్రీవాస్తవ ఈ కుట్రలో కీలక పాత్రధారులుగా తేలింది. వీరు తమ పలుకుబడితో సిఫార్సుల ద్వారా నిందితులకు ఈ ఆలయంలో లెక్కింపు విధులను కేటాయించేలా చూశారు. నిందితుల ఇళ్ల నుంచి ఇప్పటివరకు దాదాపు రూ. 70 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆలయ ట్రస్ట్లో భద్రతా లోపాలు, పర్యవేక్షణ పూర్తిస్థాయిలో లోపించడం వల్లే ఈ అక్రమాలు సాగాయని దర్యాప్తు సంస్థ పేర్కొంది. నిందితులు విధులు ముగించుకుని వెళ్లే సమయంలో తనిఖీలు చేపట్టకపోవడం వారికి మరింత సులువుగా మారింది. ఆలయ అంతర్గత ఆడిట్లలో నివేదికలు సమర్పించినా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.














Click it and Unblock the Notifications