దారుణం: నడిరోడ్డుపై కాపుకాచి రియల్టర్పై దాడి.. కత్తులతో నరికిన దుండగులు
కర్నూలు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ పురివిప్పుకుంది. శుక్రవారం సాయంత్రం కొంతమంది దుండగులు కత్తులతో కలకలం రేపారు. కల్లూరులో నడిరోడ్డుపై రియల్టర్ శ్రీనివాసులుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
కర్నూలు: కర్నూలు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ పురివిప్పుకుంది. శుక్రవారం సాయంత్రం కొంతమంది దుండగులు కత్తులతో కలకలం రేపారు. కల్లూరులో నడిరోడ్డుపై రియల్టర్ శ్రీనివాసులుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
రియల్టర్ శ్రీనివాసులు కోసం కాపుగాచిన దుండగులు ఆయన రాగానే పక్కా పథకం ప్రకారం కత్తులతో నరికారు. ఈ దాడిలో శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో చికిత్స నిమిత్తం ఆయన్ని స్థానికంగా ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై రియల్టర్ శ్రీనివాసులు కుటుంబీకులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ దాడి ఘటనపై సమాచారం అందగానే పోలీసులు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
శ్రీనివాస్కు ఎవరైనా శత్రువులున్నారా? ఈ ఘటనకు పాల్పడిందెవరు? ఎవరితో అయినా భూ తగాదాలున్నాయా? రియల్ ఎస్టేట్ విషయంలో ఎవరైనా ఇలా చేశారా? ఇతర రాష్ట్రాలకు సంబంధించిన గ్యాంగ్ డబ్బుల కోసమే ఈ దారుణానికి పాల్పడిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ దాడికి పాల్పడిన దుండగులు జిల్లాలోనే మకాం వేసుంటారనే అనుమానంతో పోలీసులు కర్నూలులోని అన్ని పోలీసు స్టేషన్లకు సమాచారం అందించి అప్రమత్తం చేశారు. వీలైనంత త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని పోలీసు ఉన్నతాధికారి చెప్పారు.