దివ్యాంగురాలిపై గ్యాంగ్ రేప్: వెలుగులోకి విస్తుపోయే విషయం..
విజయనగరం: విజయనగరం జిల్లా నెల్లిమర్ల సమీపంలోని సారిపల్లి రోడ్డులో ఆదివారం రాత్రి దివ్యాంగురాలిపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అక్క ఇంటికి వెళ్లేందుకని ఆటోలో ఒంటరిగా బయలుదేరిన ఆ యువతి(24)పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే విషయం తెలిసింది.
ఏంటా విషయం?
అత్యాచారానికి సంబంధించి యువతిని పోలీసులు పలు ప్రశ్నలు అడగ్గా.. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పింది. దీంతో పోలీసులకు అనుమానం కలిగింది. మరింత లోతుగా విచారిస్తే అసలు నిజం బయటపడింది. ఆదివారం రాత్రి అసలు తనపై గ్యాంగ్ రేప్ జరగలేదని సదరు యువతి సంచలన విషయం బయటపెట్టింది.
అబద్దం ఎందుకు చెప్పింది?
అప్పటికే ఇంటికి వెళ్లడం చాలా ఆలస్యమైందని.. ఇంత చీకటిపడ్డా ఇంటికి రాకపోవడంపై కుటుంబ సభ్యులు తిడుతారని తాను భయపడినట్టు యువతి పోలీసులకు చెప్పింది. ఆ భయంతోనే గ్యాంగ్ రేప్ కట్టు కథ అల్లినట్టు తెలిపింది. దీంతో అసలు విషయం తెలియని ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
అసలేం జరిగింది
అంతకుముందు బాధితురాలు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం సాయంత్రం 6గం.కి అక్క వాళ్ల ఇంటికి వెళ్లేందుకని ఆ యువతి విజయనగరం కోట వద్దకు చేరుకుంది. తనను తీసుకువెళ్లేందుకు బావ వస్తాడని సుమారు గంట సేపు అక్కడే వేచిచూసింది. కానీ బావ రాలేదు. దీంతో తానే ఆటోలో బయలుదేరింది. కోట నుంచి నెల్లిమర్ల వైపు వెళ్తున్న ఆటోలో ఎక్కింది. ఆ సమయంలో ఆటోలో మరో ఇద్దరు ఉన్నారు.
ముగ్గురు అత్యాచారం చేశారని..
ఆటో ఎక్కే ముందే.. తాను పూల్బాగ్ వద్ద దిగిపోతానని యువతి ఆటో డ్రైవర్ తో చెప్పింది. అయితే డ్రైవర్ మాత్రం పూల్బాగ్ వద్ద ఆపకుండా ముందుకు తీసుకెళ్లాడు. ఆటో ఆపాలని యువతి గట్టిగా అరిచినా డ్రైవర్ వినిపించుకోలేదు. ఆటోలోని మరో ఇద్దరు ఆమె నోరు మూసి కేకలు పెట్టకుండా చేశారు. ఆపై సారిపల్లి పారిశ్రామికవాడ ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విచారణలో యువతి అసలు నిజం బయటపెట్టడంతో... ఇదంతా ఇప్పడు కట్టుకథే అని తేలిపోయింది.