కేఆర్ సూర్యనారాయణకు జగన్ ఝలక్ -ఏపీ ఉద్యోగుల సంఘానికి షోకాజ్- గుర్తింపు రద్దు ?
ఏపీలో ఉద్యోగుల బకాయిల వ్యవహారం మరో మలుపు తీసుకుంది. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన వేల కోట్ల బకాయిలు ఇప్పించాలని కోరుతూ గవర్నర్ కు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలో కొందరు ప్రతినిధులు కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై ఇతర ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో గుర్రుగా ఉన్న వైసీపీ సర్కార్ కేఆర్ సూర్యనారాయణకు ఇవాళ షోకాజ్ నోటీసులు పంపింది.
గవర్నర్ కు ఉద్యోగుల ఫిర్యాదు
గతవారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలోని 8 మంది సభ్యుల బృందం విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ హరిచందన్ ను కలిసింది. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన రూ.12 వేల కోట్ల బకాయిలు ఇప్పించాలని ఆయన్ను కోరింది. ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారాలకు అంతిమ నిర్ణేత గవర్నర్ కాబట్టి ఆయన్ను విధిలేని పరిస్ధితుల్లోనే కలిసినట్లు సూర్యనారాయణ చెప్పుకొచ్చారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. గవర్నర్ తో భేటీ అయిన తర్వాత వీరిపై ఏపీ ఎన్జీవోల నేత బండి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలతో తర్వాత ఏం జరగబోతోందో అర్ధమైంది. ఇప్పుడు అదే జరిగింది.
కేఆర్ సూర్యనారాయణకు షోకాజ్
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గవర్నర్ హరిచందన్ తో భేటీ అయిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం ఇవాళ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇందులో పలు అంశాల్ని ప్రస్తావించింది. గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో ఏడు రోజుల్లోగా తెలియచేయాలని సాధారణ పరిపాలన శాఖ నోటీసు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఇరుకునపడింది. దీనిపై సరైన వివరణ ఇవ్వడంలో విఫలమైతే నిబంధనల ప్రకారం గుర్తింపు రద్దుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
నోటీసులు ఎందుకంటే ?
వేతనాలు, ఆర్ధిక ప్రయోజనాలపై ఉద్యోగులు గవర్నర్ కు ఫిర్యాదు చేయటం రోసా నిబంధనలకు విరుద్ధమని నోటీసులో ప్రభుత్వం పేర్కొంది. మీడియా, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసు జారీ చేస్తున్నట్టు సాధారణ పరిపాలన శాఖ ఇందులో పేర్కొంది. వేతనాలు, ఆర్ధిక ప్రయోజనాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే ఇతర మార్గాలున్నా గవర్నర్ ను ఎందుకు సంప్రదించాల్సి వచ్చిందని ప్రభుత్వం ఇందులో ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం దీనిపై వివరణ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
గుర్తింపు రద్దు తప్పదా ?
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి గవర్నర్ కు ఏకంగా ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన వ్యవహారంలో సీఎం జగన్ సీరియస్ గా ఉన్నారు. అంతే కాదు గవర్నర్ కు ఫిర్యాదు వెనుక రాజకీయ పార్టీలు, ముఖ్యంగా విపక్షాలు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం సేకరించిన ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై సంతృప్తికరమైన వివరణ రాకపోతే మాత్రం కచ్చితంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు కావడం ఖాయంగా కనిపిస్తోంది.