Tirumala Laddu:లడ్డూ వెనుక చంద్రబాబు బిగ్ ప్లాన్? జగన్ కోసం ముందస్తు ఉచ్చు..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూను కల్తీ చేశారంటూ సీఎం హోదాలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయాయి. రాష్ట్రంలో రాజకీయ పార్టీలతో పాటు జాతీయ స్దాయిలోనూ కేంద్రమంత్రులు, అధికార, విపక్షాలకు చెందిన పలువురు నేతలు దీనిపై స్పందిస్తున్నారు. దీంతో తిరుమల లడ్డూపై ఇప్పటివరకూ జరిగిన చర్చ ఒకటి, ఇకపై జరగబోయే చర్చ మరొకటి అన్నట్లుగా పరిస్ధితి మారిపోయింది.
లడ్డూ వివాదం ఇప్పుడే ఎందుకు?
తిరుమల లడ్డూ వివాదంపై టీడీపీ వాదన ప్రకారం చూస్తే జూన్ 4న ఎన్నికల ఫలితాలు వస్తే 12న కొత్త ప్రభుత్వం ఏర్పాటైందని, 22న తిరుమల అక్రమాలపై విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు. జూలై 7న నెయ్యి అక్రమాలు గుర్తించామని, జూలై 15న ఎన్డీడీబీ నివేదికలో లడ్డూలో జంతువుల కొవ్వు కలిసినట్లు తేలిందని చెప్తున్నారు. అయితే దాదాపు రెండు నెలల తర్వాత అంటే రెండు రోజుల క్రితం చంద్రబాబు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపేశారని ఆరోపణలు చేశారు. దీంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి.

విషయం తెలిసీ రెండు నెలలుగా..
తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారని ఎన్డీడీబీ జూలై 15న రిపోర్ట్ ఇస్తే రెండు నెలలు ఆగి తాజాగా దాన్ని చంద్రబాబు బయటపెట్టడం వెనుక ఏముందనే చర్చ మొదలైంది. విజిలెన్స్ జూలై 7న నెయ్యి కల్తీ గుర్తించగా, జూలై 15న ల్యాబ్ రిపోర్టు కూడా వచ్చేసింది. అప్పుడే దీన్ని బయటపెట్టే అవకాశం కూటమి ప్రభుత్వానికి ఉంది. కానీ అలా జరగలేదు. చంద్రబాబు వ్యూహాత్మకంగా రెండు నెలల తర్వాత దాన్ని బయటపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
జమిలి ఖరారు కాగానే..
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ రెండు రోజుల క్రితం ఆమోద ముద్ర వేసింది. త్వరలో పార్లమెంట్ లో ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు తిరుమల లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇది జమిలి ఎన్నికల అస్త్రమేనా అన్న చర్చ సాగుతోంది. ఈసారి జమిలి ఎన్నికలు జరిగితే జాతీయ అంశాలే రాష్ట్ర ఎన్నికల అజెండాగా మారడం, లేదా రాష్ట్ర ఎన్నికల అజెండాలో అంశాలు జాతీయ అజెండాకు చేరడం ఖాయం. అందుకే ఇప్పుడు తిరుమల లడ్డూ వ్యవహారం తెరపైకి తెచ్చారా అన్న చర్చ జరుగుతోంది.
జగన్ కు ముందస్తు కళ్లెం?
జమిలి ఎన్నికలపై కేంద్రం దూకుడు చూస్తుంటే పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ జరిగాక ఎప్పుడైనా దీనిపై కీలక ప్రకటన రావొచ్చని తెలుస్తోంది. దీంతో జగన్ దూకుడుకు కళ్లెం వేయాలంటే ఏదో ఒక కీలక అస్త్రం అవసరం చంద్రబాబుకు వచ్చింది. ముఖ్యంగా రాష్ట్రంలో అంశాల్ని సైతం జాతీయ స్థాయికి తీసుకెళ్లి ఇండియా కూటమి పార్టీల మద్దతు పొందిన జగన్ కు తిరిగి అక్కడి పార్టీలే వద్దనుకునే స్దాయికి తీసుకెళ్లే వ్యూహంలో భాగంగానే చంద్రబాబు తిరుమల లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ఊహించినట్లుగానే ఇప్పుడు ఎన్డీఏ కూటమితో పాటు విపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్ సైతం లడ్డూ వ్యవహారంపై విమర్శలు గుప్పిస్తోంది. ఇది భవిష్యత్తులో జగన్ కు సమస్యగా మారడం ఖాయం.












Click it and Unblock the Notifications