ఏపీ రాజధానికి సింగపూర్ సహకారం, ఆర్థిక సాయం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో రాజధాని నుండి నౌకాశ్రయం, పారిశ్రామిక కారిడార్ వరకు అన్నింటా తమ సహకారం ఉంటుందని సింగపూర్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెప్పారు. ఏపీ రాజధాని ఏర్పాటులో డిజైనింగ్ నుండి నిర్మాణం వరకు సహకారం అందిస్తామని మాజీ ప్రదాని చాక్టాంగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రతిపాదించింది. ఏపీ తీరంలో కొత్త నౌకాశ్రయం నిర్మాణానికి ముందుకు వచ్చింది. విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్ నిర్మాణంలో సాయం చేస్తామంది.
చైనా, సింగపూర్ కలిసి ఏర్పాటు చేస్తున్న ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల నిధి (ఏఐఐబి) నుండి ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో అన్ని విధాలా సహకరిస్తామని ప్రకటించారు. అద్భుతమైన రాజధాని నిర్మాణంలో కూడా తమ దేశం తరఫున సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రాష్ట్రంలోని అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాలపై చర్చకు వచ్చింది. రాజధాని అంశంపై అన్ని కోణాల్లో సింగపూర్ తరఫున సహకరిస్తామని టాంగ్ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రాజధాని నిర్మాణంపై చంద్రబాబు సింగపూర్ ప్రతినిధులకు వివరించారు. రాజధానిని అత్యుత్తమ స్థాయిలో నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. అది కూడా సింగపూర్ తరహాలో నిర్మించాలని యోచిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే సింగపూర్కు చెందిన మరికొంతమంది ప్రతినిధులు, నిపుణులతో చర్చించినట్లు చంద్రబాబు వెల్లడించారు. ఇలా ఉండగా, రాష్ట్రాన్ని మౌళికాభివృద్ధి, ఉత్పత్తి హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు చంద్రబాబు సింగపూర్ ప్రతినిధులకు వెల్లడించారు.
రాష్ట్రంలో సువిశాలంగా ఉన్న తీరం, దానిని వినియోగించుకునేందుకు ఓడరేవుల నిర్మాణం, అనేక ప్రాంతాల్లో విమానాశ్రయాలు, హైవే నిర్మాణాలు, విశాఖ-చెన్నై మధ్య పారిశ్రామిక కారిడార్ నిర్మాణం, రాష్ట్రంలోని అనేక జిల్లాలను అనుసంధానం చేస్తూ చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్, పెట్రో కెమికల్ కారిడార్, స్మార్ట్ సిటీల ఏర్పాటుపై ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను బాబు వివరించారు. అలాగే రాష్ట్రాన్ని పర్యాటక రాష్ట్రంగా తీర్చి దిద్దేందుకు తీసుకుంటున్నట్లు చర్యలను కూడా వివరించారు.
ఈ ప్రయత్నాల్లో తమ దేశ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని టాంగ్ విజ్ఞప్తి చేశారు. అలాగే పోర్టులు, విమానాశ్రయాల నిర్మాణం, పర్యాటక అభివృద్ధిలో సింగపూర్ సంస్థలను ప్రోత్సహించాలని టాంగ్ కోరారు.
ఎఐఐబి ద్వారా నిధులు సేకరించుకునేందుకు ప్రయత్నించాలని చంద్రబాబుకు టాంగ్ సూచించారు. ఈ బ్యాంకులో అనేక దేశాలు ఫౌండర్ సభ్యులుగా ఉంటున్నట్లు టాంగ్ పేర్కొన్నారు. సింగపూర్ మాజీ ప్రధాన మంత్రి, ఇతర ప్రతినిధులతో జరిగిన సమావేశం ఆశాజనకంగా ఉందని, మంచి ఫలితాలు ఇచ్చేలా ఉందని చంద్రబాబు తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రధానంగా రాజధాని అంశంపై చర్చ జరిగిందని ఆయన వివరించారు.