జగన్ చొక్కా కోసం...కోర్టులో 'సిట్' పిటిషన్;ఎయిర్ పోర్ట్ అధికారుల విచారణ
విశాఖపట్టణం:జగన్ పై హత్యాయత్నం జరిగిన సమయంలో ఆయన ధరించిన చొక్కాను తమకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ 'సిట్' పోలీసులు విశాఖ మూడో మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ సెలవులో ఉన్నందున ఈ కేసును బుధవారానికి వాయిదా వేశారు. అలాగే ప్రత్యక్ష సాక్షులుగా భావిస్తున్న వైఎస్సార్ సీపీ నేతలకు సీఆర్పీసీ 160 ప్రకారం నోటీసులు జారీ చేసినప్పటికీ వాంగ్మూలం ఇవ్వలేదని, వారి నుంచి వాంగ్మూలం తీసుకునేందుకు వీలుగా ఆదేశాలు ఇవ్వాలని సిట్ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది.
లేఖ పరీక్ష...తిరస్కరణ
ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నం కేసులో విచారణ కోసం పలు విషయాలకు సంబంధించి పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. నిందితుడు శ్రీనివాస్ జేబులో లభ్యమైనట్లు చెబుతున్న 11 పేజీల లేఖను పరీక్షించేందుకు వీలుగా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారని తెలిసింది. అయితే సాంకేతిక కారణాలతో న్యాయమూర్తి దీన్ని తిరస్కరించారని సమాచారం.
జగన్ పై దాడి నేనే చేశా;నా వెనుకెవరూ లేరు;జగన్ కు తెలియదు
మూడో రోజు...విచారణ ఇలా
మరోవైపు ఎయిర్పోర్టు పోలీసుస్టేషన్లో శ్రీనివాసరావును మూడో రోజు విచారించాక సిపి మహేష్ చంద్ర లడ్హా మీడియాతో మాట్లాడుతూ...ఇప్పటివరకూ 35 మందిని విచారించాం. శ్రీనివాసరావు 9 ఫోన్లు వాడినట్లు గుర్తించాం. వాటిలో ఏడింటిని స్వాధీనం చేసుకున్నాం. గతంలో అదే రెస్టారెంట్లో పనిచేసి ప్రస్తుతం ఉజ్జయినిలో ఉంటున్న ఇంద్రాన్ఖాన్ సెల్ఫోన్ కూడా శ్రీనివాసరావు వాడినట్లు తేలడంతో ఖాన్ కోసం ఓ ప్రత్యేక బృందం మధ్యప్రదేశ్ వెళ్లింది. కాల్డేటా ఆధారంగా శ్రీనివాసరావు ఎవరెవరితో మాట్లాడాడో దృష్టిసారించామని చెప్పారు.
ఎయిర్ పోర్ట్ అధికారులు...విచారణ
అలాగే ఎయిర్పోర్టు డైరెక్టర్ జి.ప్రకాష్రెడ్డి, సీఎస్వో వేణుగోపాల్ను సిట్ బృందం మంగళవారం మధ్యాహ్నం సుమారు మూడు గంటల పాటు విచారించింది. ప్రతి గురువారం జగన్ కోసం కాఫీ, టీలు బయట నుంచి వచ్చేవట కదా?...ఎందుకు నిలిపివేశారు?...లోపలకు పంపేందుకు అనుమతి ఉందా?...ఒకవేళ లేకుంటే ఇన్నాళ్లు ఎందుకు అనుమతించారు?...ఇప్పుడెందుకు అడ్డుకున్నారు?...ఎవరి నుంచైనా ఒత్తిళ్లు వచ్చాయా?...ఎవరైనా ఆపమన్నారా?...హర్షవర్ధన్తో మీకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది?...నిందితుడ్ని ఎప్పుడైనా చూశారా?...విధుల్లో చేరిన కొత్తలోనే ఎయిర్పోర్టులోకి కత్తులు తీసుకెళ్లాడట కదా?...మీ దృషికి ఎందుకు రాలేదు? ఇలా పలు కోణాల్లో ప్రశ్నలు వారిపై సంధించారని ఒక తెలుగు పత్రిక పేర్కొంది.
హర్షవర్ధన్...కాల్డేటా పరిశీలన
నిందితుడు శ్రీనివాసరావు పనిచేసిన హర్షవర్ధన్ కాల్డేటాను విశ్లేషిస్తున్న సిట్...అతడి ఆర్ధిక లావాదేవీలపై కూడా దృష్టి పెట్టారని తెలిసింది. ఇదిలా వుంటే సిట్ దర్యాప్తు కోసం మొత్తం 8 బృందాలు పనిచేస్తుండగా వీటిలో 3 బృందాలు శ్రీనివాసరావు కాల్ డేటా ఆధారంగా విచారణ జరిపేందుకు గుంటూరు, హైదరాబాద్, మధ్యప్రదేశ్ వెళ్లినట్లు సిట్ వర్గాలు వెల్లడించాయి. నిందితుడి నుంచి 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకోగా...మిగిలిన సెల్ఫోన్లు గ్వాలియర్, గుంటూరులో ఉన్నట్టు తెలియడంతో రికవరీ చేసేందుకు ప్రత్యేక బృందాలు బయలుదేరివెళ్లాయి.