లిక్కర్ కేసులో జగన్ ఫిక్స్- సాయిరెడ్డికి ఉచ్చు, నెక్స్ట్ స్టెప్..!!
లిక్కర్ కేసులో కీలక మలుపు. మాజీ సీఎం జగన్ కు ప్రతీ నెలా ముడుపుల సొమ్ము అందినట్లు సిట్ ఛార్జ్ షీట్ లో వెల్లడించింది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన సిట్ .. అనేక మందిని విచారణ చేసింది. మద్యం కమీషన్ల వసూళ్లలో ఎవరి పాత్ర ఏంటనేది వివరించింది. డిస్టిలరీల నుంచి కసిరెడ్డికి.. ఆయన నుంచి సాయిరెడ్డి, మిథున్, గోవిందప్ప ద్వారా జగన్ కు ముడపులు వెళ్లాయని పేర్కొంది. దీంతో, ఇప్పుడు ఈ స్కాంలో సిట్ తదుపరి చర్యల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
జగన్ కు ముడుపులు
లిక్కర్ స్కాంలో కోర్టులో సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో అనేక కీలక అంశాలను ప్రస్తావన చేసింది. అసలు ఈ కేసు విచారణ నుంచి సేకరించిన సమాచారం.. ఆధారాల గురించి క్షుణ్నంగా వివరించింది. ఏ కంపెనీ ఎంతెంత కమీషన్ ఇచ్చింది.. ఎవరికి ఎక్కడ చెల్లించింది.. ఎవరు నిర్ణయించారో కూడా వెల్లడించింది. ముడుపులు ఏయే రూపాల్లో అందాయో కూడా కోర్టుకు సమర్పించిన చార్జిషీటులో తెలియజేసింది. ముడుపుల అంతిమ లబ్ధిదారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డేనని సిట్ తేల్చటం సంచలనంగా మారింది. ఇందులో డిస్టిలరీల నుంచి చివరి వరకు ఎలా నగదు లావాదేవీలు జరిగాయనేది వవరిస్తూ..బోగస్ కంపెనీలతోనూ దారి మళ్లించారని పేర్కొంది. కసిరెడ్డి ఆధ్వర్యంలో రూ 3,500 కోట్ల వరకు మద్యం కమీషన్ల వసూలు చేసారని సిట్ వెల్లడించింది.

ఇదీ జరిగిందీ
డిస్టిలరీలను భయపెట్టి మొదట 12 శాతం ముడుపులకు ఒప్పించారు. ఆ తర్వాత 20 శాతానికి పెంచేశారని వెల్లడించింది. మొత్తం డిస్టిలరీలు, సరఫరాదారుల నుంచి కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి (ఏ-1)కి అందేదని విచారణలో గుర్తించింది. కసిరెడ్డి నుంచి నాటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏ-5), మరో ఎంపీ మిథున్రెడ్డి (ఏ-4), భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప(ఏ-33)లకు వచ్చేదని వివరించింది. ఆ ముడుపులను ఈ ముగ్గురూ అప్పటి సీఎం జగన్కు ముట్టజెప్పినట్లు సిట్ స్పష్టం చేసింది. నెలకు రూ.50-60 కోట్ల చొప్పున ఆయనకు అందాయని.. ఎన్నికల ఖర్చుకూ రూ.250-300 కోట్లు పంపిణీ చేశారని.. ఇతర నిందితులూ వాటాలు పంచుకున్నారని సంచలన అంశాలను పేర్కొంది. మొదట్లో సరఫరాదారులు ముడుపులు ఎంతెంత ఇవ్వాలో ఏ-1 రాజశేఖర్రెడ్డి, ఏ-8 సుమిత్, ఏ-2 ఎండీ వాసుదేవరెడ్డి, ఏ-6 సజ్జల శ్రీధర్రెడ్డి నిర్ణయించారని సిట్ వెల్లడించింది.
వాట్ నెక్స్ట్
2019-24 మధ్య సేల్స్ డేటాను పరిశీలిస్తే మద్యం అక్రమార్కులు సుమారు రూ.3,500 కోట్ల వరకు కూడబెట్టుకున్నట్లు అర్థమవుతోందని సిట్ పేర్కొంది. ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయ డానికి వాసుదేవరెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి, సజ్జల శ్రీధర్రెడ్డి క్రమంగా తప్పకుండా సమావేశమయ్యేవారని వివరించింది. ఇక, ఇప్పుడు ఛార్జ్ షీట్ లో సిట్ కీలక అంశాలు వెల్లడించటం...త్వరలో వెలుగులోకి మరి కొందరి పాత్ర బయటకు వస్తుందని సిట్ వెల్లడించటం ద్వారా రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. జగన్ విషయంలో సిట్ తదుపరి చర్యలు ఏంటనేది ఉత్కంఠ పెంచుతున్నాయి.












Click it and Unblock the Notifications